క్వీన్ ఎలిజబెత్ 2: వెస్ట్మిన్స్టర్ హాల్కు క్వీన్ శవపేటిక ఊరేగింపు
బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి ఊరేగింపు తరువాత రాణి ఎలిజబెత్ 2 శవపేటిక వెస్ట్మిన్స్టర్ హాల్ చేరింది.
బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి క్వీన్ ఎలిజబెత్ 2 శవపేటిక నిష్క్రమణ స్థానిక సమయం 14:22కు ప్రారంభమైంది. వెస్ట్మిన్స్టర్ హాల్కు (పార్లమెంట్) నెమ్మదిగా సాగిన ఊరేగింపులో శవపేటిక వెనుకే కింగ్ చార్లెస్ నేతృత్వంలో రాణి నలుగురు పిల్లలు నడిచారు.
పక్కనే, బిగ్ బెన్ గడియారం స్తంభం 60 సెకెండ్లకు ఒకసారి మోగేటట్టు సెట్ చేశారు. వెస్ట్మిన్స్టర్ హాల్కు సాగిన 38 నిమిషాల ఊరేగింపులో ప్రతీ 60 సెకెండ్లకు గంట మోగింది.
శవపేటిక, కింగ్స్ ట్రూప్ రాయల్ హార్స్ ఆర్టిలరీ గన్ క్యారేజ్పై మాల్ పక్క నుంచి ప్రయాణించింది. ఈ గన్ క్యారేజ్ను గుర్రాలు లాగాయి. సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించిన రైడర్స్ వీటిని నడిపారు.
లండన్ మధ్యలో ఇరువైపులా చెట్లతో సాగే విశాలపథం ఎన్నో ఏళ్లుగా లెక్కలేనన్ని వేడుకలను చూసింది. ఈ ఏడాది ప్రారంభంలో రాణి సింహాసనం అధిష్టించిన 70 ఏళ్ల వేడుక (ప్లాటినం జుబ్లీ) సహా అనేక రాచరికపు ఉత్సవాలు ఈ దారి గుండా సాగాయి.
ఊరేగింపు చూడడానికి చాలామంది జనం తరలివచ్చారు. కొందరు కన్నీళ్లతో, కొందరు నివాళిగా చేతులు చరుస్తూ క్వీన్కు తుదివీడ్కోలు పలికారు.
శవపేటికను రాచరికపు ప్రమాణాలతో కప్పి ఉంచారు. దానిపై ఇంపీరియల్ స్టేట్ క్రౌన్ (రాణి కిరీటాన్ని) ఉంచారు. అన్నీ రాచరికపు పద్ధతుల ప్రకారమే చేశారు.
కిరీటాన్ని ఊదా రంగు దిండుపై ఉంచారు. కిరీటంపై సెయింట్ ఎడ్వర్డ్స్ నీలమణి, బ్లాక్ ప్రిన్స్ కెంపు, కల్లినన్ 2 వజ్రం ఉంటాయి. కల్లినన్ 2 ప్రపంచంలోని అతిపెద్ద వజ్రం నుంచి కత్తిరించిన తునక. శవపేటికపై తెల్ల గులాబీలు, డాలియా పుష్పగుచ్ఛాలను ఉంచారు.
ఊరేగింపులో కింగ్ చార్లెస్ 3 కుమారులు ప్రిన్స్ విలియం (ఇప్పుడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్), ప్రిన్స్ హ్యారీ పాల్గొన్నారు. రాజకుటుంబానికి చెందిన ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారు.
హౌస్హోల్డ్ అశ్వికదళం సహా 1,000 మంది వరకు సాయుధ దళాల సభ్యులు ఊరేగింపులో పాల్గొన్నారు. హౌస్హోల్డ్ అశ్వికదళానికి లైఫ్ గార్డ్స్, బ్లూస్, రాయల్స్ ప్రాతినిధ్యం వహించారు.
కింగ్ చార్లెస్ 3, ఆయన తోబుట్టువులు ప్రిన్సెస్ అన్నే, ప్రిన్స్ ఎడ్వర్డ్, ఆయన కుమారుడు, ప్రిన్స్ ఆఫ్ వేల్స్, అందరూ సైనిక దుస్తులు ధరించారు.
రాజు సోదరుడు ప్రిన్స్ ఆండ్రూ, చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ ఇద్దరూ సూట్లు ధరించారు. ప్రిన్స్ హ్యారీ రాజకుటుంబం నుంచి బయటకు వచ్చినట్టు 2020లో ప్రకటించారు.
ప్రిన్స్ ఆండ్రూ కూడా ఇప్పుడు రాజకుటుంబం సభ్యుడు కాదు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన తన సైనిక పదవులు/బిరుదులు కోల్పోయారు. అమెరికాలో ఒక లైంగిక వేధింపుల కేసులో ఆయనపై విచారణ సాగింది. తనేమీ తప్పుచేయలేదని ఆయన వాదించారు. ఈ కేసు విచారణకు కొద్ది రోజుల ముందు ఆయన తన సైనిక పదవులను కోల్పోయారు.
క్వీన్ కన్సార్ట్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్, డచెస్ ఆఫ్ ససెక్స్, కౌంటెస్ ఆఫ్ వెసెక్స్ అందరూ బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి కారులో బయలుదేరి వెస్ట్మినిస్టర్ హాల్ చేరుకున్నారు. ఊరేగింపు తరువాత అక్కడ కింగ్తో కలిసి చిన్న ప్రార్థనలో పాల్గొన్నారు.
ఊరేగింపు హార్స్ గార్డ్స్ పరేడ్తో పాటు వైట్హాల్ మీదుగా సాగి స్థానిక సమయం 15.00 గంటలకు వెస్ట్మిన్స్టర్ హాల్ చేరుకుంది.
గ్రెనాడియర్ గార్డ్స్లోని ఎనిమిది మంది యువకులకు క్వీన్ శవపేటికను వెస్ట్మిన్స్టర్ ప్యాలెస్లోకి తీసుకెళ్లే బాధ్యతను అప్పగించారు.
రాబోయే నాలుగు రోజుల్లో రాణికి నివాళులు అర్పించేందుకు వేలాది మంది ప్రజలు తరలి వస్తారని భావిస్తున్నారు. అందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
వెస్ట్మిన్స్టర్ హాల్ వద్ద ఉదయం నుంచే గార్డులు కాచుకుని ఉన్నారు
థేమ్స్ నది ఒడ్డున జనం క్యూలు కట్టారు. రాణి శవపేటిక కోసం ఎదురుచూస్తూ నిల్చున్నారు.
సెప్టెంబరు 19 సోమవారం ఉదయం రాణి అంత్యక్రియలు జరుగుతాయి. అప్పటివరకు ఆమె శవపేటికను వెస్ట్మిన్స్టర్ హాల్లోనే ఉంచుతారు.
All photos subject to copyright.