మళ్లీ రాజుకున్న 'రాఫెల్' వివాదం-'దొంగ గడ్డం' అంటూ మోదీపై రాహుల్-నెటిజన్లకు 4 ఆప్షన్లు...
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదం మళ్లీ రగులుతోంది. కొన్నాళ్లుగా మరుగునపడిన ఈ వివాదాన్ని కాంగ్రెస్ మళ్లీ తెర పైకి తీసుకొచ్చింది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఫ్రాన్స్లో దీనిపై విచారణ జరుగుతోందని... అలాంటప్పుడు భారత్లో ఎందుకు విచారణ జరపరని ప్రశ్నిస్తోంది. తాజాగా ఇదే అంశంపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని టార్గెట్ చేశారు.

దొంగ గడ్డం అంటూ మోదీపై రాహుల్...
ట్విట్టర్లో ప్రధాని మోదీ గడ్డం ఫోటోను పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ... 'చోర్ కీ దాదీ(ఆ దొంగ గడ్డం)' అని కామెంట్ను జత చేశారు. #Rafalescam హాష్ ట్యాగ్తో రాహుల్ ఈ పోస్ట్ చేశారు. మరో ట్వీట్లో రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందంపై విచారణకు మోదీ సర్కార్ ఎందుకు సిద్దంగా లేదని ప్రశ్నించారు. ప్రశ్నించడమే కాదు... దానికి గల కారణాలేంటో చెప్పాలంటూ నెటిజన్లకు నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు.
రాహుల్ ట్విట్టర్ సర్వే...
రాహుల్ ఇచ్చిన ఆప్షన్లలో 'అపరాధ భావన,స్నేహితులను కాపాడేందుకు,జేపీసీకి రాజ్యసభ సీటు అవసరం లేదా,పైవన్నీ' అనే నాలుగు ఆప్షన్లను రాహుల్ ఇచ్చారు. ఒకరకంగా రాఫెల్ యుద్ద విమానాల కొనుగోళ్ల వివాదంపై ఆయన ట్విట్టర్ వేదికగా సర్వేకి తెరలేపారు.ఇందులో నాలుగో ఆప్షన్కు 64 శాతం మంది నెటిజన్ల నుంచి స్పందన రావడం గమనార్హం.

అసలేంటీ వివాదం...
2016లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫ్రాన్స్కి చెందిన డసాల్ట్ ఏవియేషన్తో 36 యుద్ద విమానాల కొనుగోళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. నిజానికి 2012లో యూపీఏ హయాంలోనే ఈ ఒప్పందం జరిగినప్పటికీ... మోదీ హయాంలో ఈ ఒప్పందంలో భారీ మార్పులు జరిగాయి. యూపీఏ హయాంలో డసాల్ట్ కంపెనీ నుంచి కేవలం టెక్నాలజీ,విమాన తయారీ విడి భాగాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వాటిని భారత్లోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో అసెంబుల్ చేయాలని నిర్ణయించారు.

కాంగ్రెస్ ఏమంటోంది....
కానీ యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందానికి భిన్నంగా మోదీ సర్కార్ ఎగరడానికి సిద్దంగా ఉన్న విమానాలనే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ హయాంలో నిర్ణయించిన మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ వ్యయంతో రూ.58వేల కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందంలో అవినీతి అవకతవకలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ను పక్కకు తప్పించి అనిల్ అంబానీకి చెందిన కంపెనీని ఈ ఒప్పందంలో భాగస్వామిగా చేర్చడాన్ని ప్రశ్నిస్తోంది.
తిప్పికొడుతున్న బీజేపీ
ఇదే క్రమంలో ఇటీవల ఫ్రాన్స్లో ఈ ఒప్పందంపై న్యాయ విచారణ ప్రారంభమైంది. దీంతో భారత్లోనూ దీనిపై విచారణ జరపాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. బీజేపీ మాత్రం కాంగ్రెస్ ఆరోపణలను మొదటినుంచి తోసిపుచ్చుతోంది. తాజాగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుకు నిదర్శనమని బీజేపీ ఐటీ సెల్ ఇన్చార్జి అమిత్ మాళవియా విమర్శించారు. 2019లోనే రాహుల్ను దేశ ప్రజలు తిరస్కరించారని గుర్తుచేశారు. అయినప్పటికీ 2024లో తమతో పోటీకి ఆయనకు స్వాగతం పలుకుతున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications