రాహుల్ గాంధీకి తీవ్ర జ్వరం: ఎన్నికల టూర్ రద్దు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, యువరాజు రాహుల్ గాంధీ పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు. మంగళవారం పుదుచ్చేరిలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ షెడ్యూల్ ఖరారైయ్యింది.
అయితే తీవ్ర జ్వరంతో బాధపడుతున్నందున తాను ఎన్నికల ప్రచార పర్యటకు హాజరు కాలేకపోతున్నానని సోమవారం అర్దరాత్రి దాటిన తరువాత రాహుల్ గాంధీ స్వయంగా ట్విట్ చేశారు. తనను రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు.
ఈనెల 10,11వ తేదిల్లో పుదుచ్చేరి, తమిళనాడు, కేరళలో రాహుల్ గాంధీ పర్యటించవలసి ఉంది. ఈ కార్యక్రమాలు అన్ని రద్దు అయ్యాయని, తాను ఎన్నికల ప్రచారానికి రాలేనందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు క్షమాపణ చెబుతున్నానని రాహుల్ గాంధీ అన్నారు. అయితే రాహుల్ గాంధీని చంపేస్తామని సోమవారం బెదిరింపు లేఖలు వచ్చిన విషయం తెలిసిందే.
రాహుల్ గాంధీని అంతం చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు తమిళంలో రాసిన బెదిరింపు లేఖలను పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నారాయణస్వామి ఇంటికి పంపించారు. నారాయణస్వామి వెంటనే కాంగ్రెస్ హై కమాండ్ కు విషయం చెప్పారు.
కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి రాహుల్ గాంధీకి భద్రత కల్పించాలని, బెదిరింపు లేఖలు రాసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేశారు. రాహుల్ గాంధీకి మరింత భద్రత పెంచాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంబంధిత అ ధికారులకు ఆదేశాలు జారీ చేశారు.