రాహుల్ గాంధీపై అనర్హత వేటు
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచి విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటిపేరు (Modi Surname) వ్యవహారంలో ఆయనను సూరత్ న్యాయస్థానం దోషిగా తేల్చిన నేపథ్యంలో లోక్ సభ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటిపేరు (Modi Surname) వ్యవహారంలో ఆయనను సూరత్ న్యాయస్థానం దోషిగా తేల్చిన నేపథ్యంలో లోక్ సభ ఈ నిర్ణయం తీసుకుంది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ఆయన కర్ణాటకలోని కోలార్ లో రోడ్ షో, భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరును ప్రస్తావించారు. వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసగించి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల పేర్లన్నీ మోదీ ఇంటిపేరుతోనే ఎందుకు ఉంటోన్నాయని ప్రస్తావించారు.

ఈ క్రమంలో నీరవ్ మోదీ, లలిత్ మోదీల పేర్లను ప్రస్తావించారు. మోదీ అనే ఇంటిపేరు ఉన్న వారందరినీ రాహుల్ గాంధీ కించపర్చారంటూ అప్పట్లో కేసు దాఖలైందాయన మీద. గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ- ఆయనపై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో గుజరాత్ లోని సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్- రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించింది.

రెండు సంవత్సరాల కారాగార శిక్షను విధించింది. ఇటీవలే రాహుల్ గాంధీ సూరత్ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. అప్పీల్ చేసుకోవడానికి 30 రోజుల పాటు గడువు ఇచ్చింది న్యాయస్థానం రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీపై నేరారోపణ రుజువు కావడంతో ఆయనపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్ ఊపందుకుంది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలందరూ ఈ డిమాండ్ లేవనెత్తుతూ వస్తోన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయనపై అనర్హత వేటు పడింది.
ఈ మేరకు లోక్ సభ సెక్రెటేరియట్- కొద్దిసేపటి కిందటే ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఈ), ప్రజా ప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్ 8 ఆధారంగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినట్లు వివరించింది. సూరత్ లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ లో ఆయనపై సీసీ/18712/2019 కింద ఆయన దోషిగా తేలారని, దీనితో ఆయనపై అనర్హత వేటు వేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ మేరకు గురువారమే తీర్మానించిందని తెలిపింది.












Click it and Unblock the Notifications