జనం సహకారం చూసి కన్నీళ్లొచ్చాయ్-భారత్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్..
134 రోజుల పాటు సాగిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇవాళ కశ్మీర్లోని శ్రీనగర్లో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా భారీ హిమపాతం మధ్య కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి రాహుల్ భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారిలో చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ కశ్మీర్లోని శ్రీనగర్ లో ముగిసింది. భారీ హిమపాతం కారణంగా శ్రీనగర్ లో ముగింపు సభ నిర్వహించడం సైతం కష్టంగా మారిన వేళ.. ఎలాగోలా సభ నిర్వహణను చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ తన యాత్ర ఎలా సాగిందో వివరించారు. ఎన్ని కష్టాలకోర్చి ఈ యాత్ర చేపట్టారో, అందులో తనకు ఎదురైన అనుభవాలను రాహుల్ కాంగ్రెస్ శ్రేణులతో పంచుకున్నారు.
భారత్ జోడో యాత్ర ముగింపు సభ సందర్భంగా శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో రాహుల్ జాతీయ జెండా ఎగురవేశారు.
ముగింపు సభలో ప్రసంగించిన రాహుల్.. భారత్ జోడో యాత్రకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ యాత్ర తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని రాహుల్ వెల్లడించారు. ప్రజల సహకారం చూసి తనకు కన్నీళ్లు వచ్చాయని, ఓ దశలో యాత్ర పూర్తి చేయగలనా అని అనుకున్నట్లు కాంగ్రెస్ యువనేత గుర్తుచేసుకున్నారు. ఈ యాత్రలో ప్రజల దీన స్ధితి చూసి టీషర్టుతోనే యాత్ర కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ తెలిపారు.

134 రోజుల పాటు భారత్ జోడో యాత్రలో తనకు ఎదురైన అనుభవాల్ని రాహుల్ వెల్లడించారు. కశ్మీర్ తన పూర్వీకుల స్వస్ధలమని, కానీ ఇప్పుడు కశ్మీర్ కష్టాల్లో ఉందని రాహుల్ తెలిపారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, అసలైన ప్రజాస్వామ్యం పునరుద్దరించాల్సి ఉందన్నారు. అందుకోసం తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా బీజేపీ-ఆర్సెస్సెస్ చేస్తున్న విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం సంతోషంగా ఉందని రాహుల్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications