'భారత్ జోడో యాత్ర'లో పెళ్లి ప్రస్తావన!.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ''భారత్ జోడో యాత్ర'' కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర భోజన విరామ సమయంలో ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయితీ నుంచి మొదలైన యాత్ర మధ్యాహ్నం అదే జిల్లా మార్తాండం దగ్గర భోజనం కోసం ఆగారు. ఈ సందర్భంగా సఉపాధి హామీ పథకంస కింద పనిచేస్తున్న మహిళలతో రాహుల్ మాట్లాడారు. ఆదాయం ఎంత వస్తోంది? వారి కుటుంబ పరిస్థితులు, పథకంలో మార్పులు ఏమైనా అవసరమా? తదితర అంశాలపై మాట్లాడారు.
వీరితో మాట్లాడుతున్న తరుణంలోనే ఒక మహిళ రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన తెచ్చింది.
రాహుల్ గాంధీ తమిళనాడును ఎక్కువగా ప్రేమిస్తారని తమకు తెలుసని, అందుకే తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అడిగినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తన ట్విటర్లో వెల్లడించారు. వారితో మాట్లాడుతున్నప్పుడు రాహుల్ ఉత్సాహంగా, సంతోషంగా కనిపించారంటూ ఆ సన్నివేశానికి తగ్గ రెండు ఫొటోలను తన ట్వీట్కు జత చేశారు.

తెలంగాణలోని మేడ్పల్లి గ్రామం నుంచి పాదయాత్రగా వెళ్లిన ఊసయ్య అనే వ్యక్తి రాహుల్ ను కలిశారు. కొంచెంసేపు ఆయనతో కలిసి నడిచారు. సాయంత్రానికి కేరళ సరిహద్దులోకి యాత్ర ప్రవేశించింది. అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్గాంధీకి ఘన స్వాగతం పలికారు. కేరళలో 18 రోజుల పాటు ''భారత్ జోడో యాత్ర'' కొనసాగనుంది.

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ తదితర అంశాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు రాహుల్ గాంధీ ఈ యాత్ర చేస్తున్నారు. ఆరు నెలలపాటు 12 రాష్ట్రాలమీదగా సాగి కాశ్మీర్ కు చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications