కేంద్ర బడ్జెట్: అంతా షేర్-షాయరీలే, తడిసిన తారాజువ్వ: రాహుల్ గాంధీ పెదవి విరుపు
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా షేర్-షాయరీలేనని, తీవ్రంగా నిరాశపరిచిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా షేర్-షాయరీలేనని, తీవ్రంగా నిరాశపరిచిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. యువత కోసం, రైతుల కోసం కేంద్ర బడ్జెట్ లో ఏమీ లేదని పెదవి విరిచారు.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం అనంతరం పార్లమెంట్ వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ''మేం టపాసుల మోత మోగుతుందని ఆశించాం. తీరాచూస్తే బడ్జెట్ తడిసిపోయిన తారాజువ్వలా తుస్సుమంది..'' అని వ్యాఖ్యానించారు.
రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో పారదర్శకత పాటించే దిశగా తీసుకునే ఎలాంటి చర్యలకైనా తాము మద్దతు ఇస్తామన్నారు. బడ్జెట్ లో తాము మెరుపుల కోసం ఎదురు చూశామని, కానీ అలాంటివేమీ లేవని, బడ్జెట్ ప్రసంగం చాలా చప్పటీ ముగిసిందని రాహుల్ పేర్కొన్నారు.
దేశం నిరుద్యోగం, రైతాంగ సమస్యలు వంటి మౌలిక సమస్యలు ఎదుర్కొంటోందని, కానీ మోడీ ప్రభుత్వం మాత్రం యువతకు, రైతులకు ఉపశమనం కలిగించే కనీస చర్యలు కూడా బడ్జెట్ లో ప్రకటించలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.