కర్నాటకను ప్రేమతో గెలిచాం- తొలిరోజే హామీలు నెరవేరుస్తాం-రాహుల్ గాంధీ కామెంట్స్...
కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరాడిన కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దాదాపు 135 సీట్లు సాధించి చాలా కాలం తర్వాత సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విజయానికి కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి నడవడంతో పాటు రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర కూడా కారణమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ భారీ విజయంపై రాహుల్ గాంధీ ఇవాళ స్పందించారు.
కర్నాటకలో కాంగ్రెస్ సంచలన విజయం నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన రాహుల్ గాంధీ.. మీడియాతో సంతోషాన్ని పంచుకున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుపై స్పందించిన రాహుల్.. ముందుగా అక్కడి పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. వారి కృషి కారణంగానే కాంగ్రెస్ గెలిచిందన్నారు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు బలవంతులపై పేదలు సాధించిన విజయంగా రాహుల్ అభివర్ణించారు. కర్నాటకలో పేదల వైపు కాంగ్రెస్ నిలిచిందన్నారు.

అలాగే కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విద్వేషంతో గెలవలేదని, ప్రేమతో కర్నాటకను గెలిచామని రాహుల్ గాంధీ తెలిపారు. గతంలో భారత్ జోడో యాత్రలో చెప్పినట్లుగానే విద్వేష మార్కెట్ లో ప్రేమ దుకాణం తెరిచామంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ విజయం స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లోనూ గెలుస్తామని రాహుల్ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే ఫలితాలు రాబోతున్నాయని రాహుల్ తెలిపారు.
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీల్ని నెరవేరుస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అధికారం చేపట్టగానే తొలి కేబినెట్ భేటీలోనే హామీల అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇచ్చిన ఐదు హామీల్ని తొలిరోజే అమలు చేస్తామని రాహుల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇదే విధానం అమలుచేస్తామని రాహుల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాహుల్ సంబరాలు జరుపుకుంటున్నారు.












Click it and Unblock the Notifications