కశ్మీర్లో నిలిచిన రాహుల్ భారత్ జోడో యాత్ర ! ఏం జరిగిందంటే ?
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చివరి మజిలీ అయిన కశ్మీర్లో ఇవాళ అర్ధాంతరంగా నిలిచిపోయింది. రాహుల్ గాంధీ భద్రతా లోపాల కారణంగా కాంగ్రెస్ ఇవాళ యాత్ర నిలిపేసింది.
దేశవ్యాప్తంగా బీజేపీ సాగిస్తున్న విద్వేష రాజకీయాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇప్పటివరకూ విజయవంతంగా సాగింది. యాత్ర ఆద్యంతం చురుగ్గా నడుస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో రాహుల్ ఉత్సాహం నింపుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా పెరుగుతుందన్న నివేదికలు వస్తున్నాయి. అయితే చివరి మజిలీ అయిన కశ్మీర్లో ఇవాళ ఈ యాత్రకు ఊహించని ఆటంకం ఎదురైంది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఇవాళ ఉదయం కశ్మీర్లోని బనిహాల్ లో నడక మొదలుపెట్టారు. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాతో కలిసి రాహుల్ గాంధీ నడక సాగించారు. వీరిద్దరూ గంటసేపు నడిచిన తర్వాత యాత్ర అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో ఏం జరిగిందో ఎవరికీ కాసేపు అర్ధం కాలేదు. రాహుల్ గాంధీ కూడా దీంతో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా విరమించారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఇవాళ కశ్మీర్ లోయలో 20 కిలోమీటర్లు నడవాల్సి ఉంది. కానీ కిలోమీటర్ యాత్ర కొనసాగాక నిలిచిపోయింది. రాహుల్ కు యాత్రలో కల్పిస్తున్న భద్రతను పోలీసులు ఒక్కసారిగా ఉపసంహరించారు. దీంతో భారీగా జనం రాహుల్ పైకి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి అప్పటికప్పుడు వచ్చిన ఆదేశాలతో రాహుల్ యాత్ర విరమించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాహుల్ యాత్రలో పోలీసుల భద్రతా లోపం వల్లే యాత్ర ఆపాల్సి వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. భద్రతా లోపాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.