Rahul Gandhi : అధికారం కోసం మణిపూర్ ను తగలబెట్టడానికీ రెడీ-బీజేపీపై రాహుల్ విమర్శలు..
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మూడు నెలలుగా కొనసాగుతున్న జాతి ఘర్షణల విషయంలో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని విపక్ష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రంగా తప్పుబట్టారు. అధికారం కోసం బీజేపీ మణిపూర్ ను తగులబెట్టేందుకు కూడా సిద్దమవుతోందని విమర్శించారు. అలాగే మణిపూర్ లో హింసపై బీజేపీకి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఇదే అంశంపై తాము పార్లమెంటులో ఇప్పటికే అవిశ్వాస తీర్మానానికీ నోటీసు ఇచ్చామన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ మణిపూర్ హింసాకాండ విషయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికారం కోసం వీరిద్దరూ ఏమైనా చేస్తారన్నారు. తాము అధికారంలో కొనసాగేందుకు మణిపూర్ ను కాల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడ కలహాలు జరిగినా సామాన్య ప్రజలు బాధ పడతారని, అయితే మణిపూర్లో హింసపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు ఎలాంటి బాధా లేదని రాహుల్ ఆరోపించారు. వారు దేశాన్ని విభజించారని, వారు మొదటి నుండి అలాగే చేస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు.

మణిపూర్ హింసాకాండపై రాహుల్ బీజేపీ, ఆర్ఎస్ఎస్లను విమర్శించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసింది. మణిపూర్ లో పరిస్థితిపై పార్లమెంటులో వివరణాత్మక చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమికి చెందిన ప్రతిపక్ష ఎంపీల బృందం జూలై 29, 30 తేదీల్లో మణిపూర్లో పర్యటించనుంది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కోసం ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన నోటీసును లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది.
మణిపూర్లో నెలకొన్న పరిస్థితులతోపాటు పలు అంశాలపై ప్రభుత్వం, ప్రధాని నుంచి సమాధానం కోరేందుకు అవిశ్వాస తీర్మానానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు విపక్ష నేతలు తెలిపారు. మణిపూర్ సమస్యపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సమగ్ర చర్చ జరగాలని, ప్రధాని ప్రకటన చేయాలంటూ విపక్షాలు ఇవాళ కూడా రాజ్యసభలో ఆందోళనకు దిగాయి.












Click it and Unblock the Notifications