ఉగ్రవాది ఇంట్లో ఉండటానికి కేజ్రీవాల్ రెడీ.. గతాన్ని తవ్విన రాహుల్ గాంధీ
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. క్యాంపెయిన్లో నేతలు బిజీగా ఉన్నారు. నేతల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. అధికార కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల డైలాగ్ వార్ తీవ్ర స్థాయికి చేరింది. 'ఆప్' అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ వంటి నేతలు టెర్రరిస్టుల ఇళ్లలో ఉండేందుకు వెనుకాడరని కామెంట్ చేశారు. కాంగ్రెస్ నేతలు ఎవరూ టెర్రరిస్టుల ఇళ్లలో కనిపించరని రాహుల్ స్పష్టం చేశారు.
2017 ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఖలిస్తాన్ మాజీ ఉగ్రవాది ఇంట్లో ఓ రాత్రి బస చేశారు. ఈ అంశాన్ని రాహుల్ గాంధీ ఎత్తిచూపారు. ఇలాంటి నేతలను నమ్ముకుంటే, టెర్రరిస్టులతో మెతక వైఖరి అవలంబించి జాతీయ భద్రతను తాకట్టు పెడతారని విమర్శించారు. ఒక్క చాన్స్ అంటున్నారని, కానీ ఆప్ వాళ్లకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని అన్నారు.
ఇటు అమరీందర్ సింగ్ సారథ్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ 37 స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీ 65 సీట్లలో బరిలో ఉంది. కూటమిలోని ధిండ్సా పార్టీ 15 సీట్లలో బరిలోకి దిగుతోంది. పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ సీట్లున్నాయి. ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్లో ఈసీ తెలిపింది. కానీ రాజకీయ పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ ప్రకటన చేసింది. మార్చి 10న ఫలితాలు రానున్నాయి.
పంజాబ్లో అధికారం తిరిగి చేపట్టాలని కాంగ్రెస్ ఊవ్విళ్లూరుతుంది. ఆప్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. గతంలో కన్నా మెరుగైన ప్రదర్శన చేపడితే చాలు అనుకుంటుంది. అధికారం తమకే అనే ధీమాతో ఉంది. దీంతో ఇరుపార్టీల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది.