యడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డిని గబ్బర్ సింగ్ తో పోల్చిన రాహుల్ గాంధీ, మోడీ, సాంబా !
బీదర్/బెంగళూరు: కర్ణాటక ఎన్నికల సందర్బంగా ప్రచారం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గురువారం కలబురిగిలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ మీద విమర్శలు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీదర్ లోని ఔరాద్ లో మోడీ ప్రభుత్వం మీద విమర్శలు చేసి బీఎస్. యడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి సోదరులను షోలే సినిమాలో గబ్బర్ సింగ్ పాత్రతో పోల్చారు. కర్ణాటకలో 8వ సారి గురువారం పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ జనాశ్వీరద ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రధాని పదవికి గౌరవం
కర్ణాటకలో బసవేశ్వరుడు చెప్పినట్లే సిద్దరామయ్య ప్రభుత్వం నడుచుకుందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మీద తాను వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శలు చెయ్యలేదని, ప్రధాని నరేంద్ర మోడీ తన మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, ఆయితే ప్రధాని పదవిలో ఉన్న మోడీకి తాను గౌరవం ఇస్తానని, విమర్శలు చెయ్యలేనని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ చురకలు అంటించారు.
జైలుకు వెళ్లిన వ్యక్తి సీఎం
జైలుకు వెళ్లి వచ్చిన యడ్యూరప్పను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారని, జైలుకు వెళ్లి వచ్చిన నలుగురు మాజీ మంత్రులకు టిక్కెట్లు ఇచ్చారని, ఇలాంటి వారికి మీరు ఓటు వేసి అధికారంలోకి రావడానికి సహకరిస్తారా అని రాహుల్ గాంధీ ప్రజలను ప్రశ్నించారు.
దొంగలను దేశం దాటించారు
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులను కేంద్రం మా పథకాలు అని చెప్పుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టిన నీరవ్ మోడీ, చోక్సీ, విజయ్ మాల్యా లాంటి దొంగలను వీరు దేశం దాటించేశారని కేంద్ర ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.
జీఎస్టీతో సర్వనాశనం
జీఎస్టీ బిల్లు తీసుకు వచ్చి సామాన్యులు, మద్యతరగతి వారు నానా ఇబ్బందులు పడటానికి బీజేపీ కారణం అయ్యిందని, ఇలాంటి వారికి కర్ణాటకలో అధికారం ఇచ్చి మరన్ని కష్టాలు తెచ్చుకోకూడదని, వీళ్లు (బీజేపీ) సర్వనాశనం చేస్తారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
గబ్బర్ సింగ్ లు
షోలే సినిమాలో గబ్బర్ సింగ్ లా కర్ణాటకలో బీఎస్ యడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి సోదరులు తయారు అయ్యారని, వీరు రాష్ట్రాన్ని దోచేస్తారని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీలో గబ్బర్ సింగ్ తో పాటు కాలియా, సాంబా ఇలా అందరూ ఉన్నారని రాహుల్ గాంధీ వ్యంగంగా అన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వారికి ఓట్లు వేసి పెద్ద తప్పు చెయ్యరాదని కన్నడిగులకు రాహుల్ గాంధీ మనవి చేశారు.