‘మహాత్మాగాంధీ హత్య’: రాహుల్ గాంధీకి సుప్రీం చీవాట్లు
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ హత్య వెనుక రాష్ట్రీ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) హస్తముందని ఆరోపించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చీవాట్లు పెట్టింది. రాహుల్పై ఆర్ఎస్ఎస్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై మంగళవారం విచారణ జరిగింది.
'అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పండి... లేదంటే విచారణ ఎదుర్కోండి' అని రాహుల్కు సుప్రీం అల్టిమేటం జారీ చేసింది. ఆయన యావత్తు సంస్థపైనే ఆరోపణలు గుప్పించకుండా ఉండాల్సిందని పేర్కొంది. ప్రకటన చేసేటపుడు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని తెలిపింది. యావత్తు సంస్థపై దోషారోపణలు చేయకూడదని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ధర్మాసనం పేర్కొంది.
స్వాతంత్ర్యంపై ఆంక్షలేవీ లేవని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. వాక్ స్వాతంత్ర్యంపై మాత్రమే పరిమితులు ఉన్నాయని పేర్కొంది. రచయితలు, రాజకీయవేత్తలు, విమర్శకులు ఏం చెప్పినా, కాస్త సంయమనం ఉండాలని స్పష్టం చేసింది. అంతేగాక, రాహుల్ గాంధీ ప్రసంగంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తప్పుడు చరిత్రను పేర్కొంటూ ఎందుకు ప్రసంగించారని ప్రశ్నించింది.
పిటిషనర్ ఆరోపణలు ఐపీసీ సెక్షన్ 499 (పరువు నష్టం) క్రిందకు వస్తాయా, రావా? అనే అంశాన్ని తాము పరిశీలించవలసి ఉంటుందని, అయితే దీనికి సంబంధించిన తీర్పు ఇప్పటికే ఉందని స్పష్టం చేసింది. పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోతే విచారణను ఎదుర్కొనాల్సిందేనని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
కాగా, రాహుల్ గాంధీ తరపున సీనియర్ న్యాయవాది హరీన్ రావల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ రికార్డులు, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తీర్పు ఆధారంగానే రాహుల్ గాంధీ మాట్లాడారన్నారు. ఆరెస్సెస్ను ఆయన నేరుగా ప్రస్తావించలేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తీర్పులో నాథూరాం గాడ్సే ఆరెస్సెస్ కార్యకర్త అని మాత్రమే చెప్పిందని గుర్తు చేసింది.
గాంధీని నాథూరాం గాడ్సే చంపారని చెప్పడానికి, ఆరెస్సెస్ చంపిందని అనడానికి చాలా తేడా ఉందని వివరించింది. యావత్తు సంస్థను, అందర్నీ ఒకే గాటన కట్టేసి ఆరోపణలు చేయకూడదని పేర్కొంది.