ఓటేస్తామంటే డ్యాన్స్ కైనా రెడీ..! మోడీపై రాహుల్ తీవ్ర విమర్శలు..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారాన్ని వివాదంతో ప్రారంభించారు. ఇవాళ బీహార్ లోని ముజఫర్ పూర్ లో మహాకూటమి తరపున ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. ఓటేస్తామని చెప్పండి చాలు ఆయన డ్యాన్స్ చేయడానికైనా రెడీ అయిపోతారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఎక్కడో తాకాయి. దీంతో బీజేపీ నేతలు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టేశారు.
మహాకూటమి సీఎం అభ్యర్ధి తేజస్వి యాదవ్ తో కలిసి ముజఫర్ పూర్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రాహుల్ గాంధీ ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ నిశిత విమర్శలు చేశారు. ఓట్ల కోసం ఏదైనా చేయడానికి ప్రధాని మోడీ సిద్ధంగా ఉంటారని, ఇప్పుడు మీరు డ్యాన్స్ చేయమంటే వెంటనే చేసేస్తారని, కానీ ఓసారి ఓట్లు వేయించుకున్నాక మాత్రం కనిపించరంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలకు సభికుల నుంచి భారీ స్పందన వచ్చింది.

బీహారీలు అతి పెద్ద పండుగగా భావించే ఛత్ పూజ గురించి స్పందిస్తూ.. ఢిల్లీలోని కలుషితమైన యమునా నదిలో భక్తులు ప్రార్థనలు చేస్తుంటే.. ప్రధానమంత్రి మోడీ ప్రత్యేకంగా తయారు చేసిన చెరువులో స్నానం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇది ఆయన ద్వంద విధానాలకు నిదర్శనం అన్నారు. నరేంద్ర మోడీ తన స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడానికి వెళ్ళారని, ఆయనకు యమునా నదితో సంబంధం లేదని తెలిపారు. అలాగే ఆయనకు ఛత్ పూజతో సంబంధం లేదన్నారు. అతనికి మీ ఓటు మాత్రమే కావాలన్నారు.

20 ఏళ్లుగా బీహార్ కు సీఎంగా ఉన్న నితీశ్ కుమార్ వెనుకబడిన వర్గాలకు చేసిందేమీ లేదని రాహుల్ విమర్శించారు. బీజేపీ నితీశ్ కుమార్ మొహం మాత్రమే వాడుకుటుందని, రిమోట్ కంట్రోల్ మాత్రం వారి చేతిలోనే ఉంటుందని గుర్తుచేశారు. బలహీనవర్గాల స్వరం నితీష్ దగ్గర వినిపిస్తుందని భావించొద్దని, ఎందుకంటే రిమోట్ కంట్రోల్ ఆయన చేతిలో కాకుండా బీజేపీ చేతిలో ఉందని రాహుల్ విమర్శించారు. బీహార్లోనూ ఓట్ల చోరీ జరిగే అవకాశం ఉందని రాహుల్ గాంధీ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications