మోడీ-షాల ఆందోళన: రాహుల్ గాంధీకి స్మృతి ఇరానీ కౌంటర్, లీగల్ నోటీసులపై ప్రధాని స్పందన!
న్యూఢిల్లీ/బెంగళూరు: 2019 ఎన్నికల్లో తానే ప్రధానమంత్రి కావొచ్చునని వ్యాఖ్యానించిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే తాను ప్రధాని అవుతానని రాహుల్ అన్నారు.
అమిత్ షా, మోడీలకు సిద్ధరామయ్య ఊహించని ఝలక్, లీగల్ నోటీసులు: ఇదీ కారణం
ఆయన వ్యాఖ్యలకు స్మృతి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ప్రకటనతో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు ప్రజల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. తనపై తనకే విశ్వాసం లేని వ్యక్తిని, తన సామర్థ్యంపై తనకే నమ్మకం లేని వ్యక్తిని ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
ప్రజల మనసులోని మాట వినరు
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ తదితరులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోడీపై రాహుల్ విమర్శలు చేస్తుంటే, మోడీ సీఎం సిద్ధరామయ్య అవినీతిని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని మోడీ మన్ కీ బాత్ ద్వారా తన మనసులోని మాట చెబుతున్నారని, కానీ దేశ ప్రజలు ఏం చెబుతున్నారో వినడం లేదని రాహుల్ గౌరీబిదనూర్ రోడ్డు షోలో అన్నారు.
అమిత్ షాపై రాహుల్ విమర్శలు
అమిత్ షా హత్య కేసు నిందితుడు అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆయన పట్ల విశ్వసనీయత లేదన్నారు నిజాయితీ, విధేయత గురించి మాట్లాడే అర్హత బీజేపీకి అధినేత అమిత్ షా అని, ఆ పార్టీకి మాట్లాడే హక్కు లేదన్నారు. అవినీతి కేసుల్లో చిక్కుకున్న యెడ్యూరప్పను ఎందుకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారో చెప్పాలన్నారు.
లీగల్ నోటీసులపై స్పందించిన మోడీ
మరోవైపు, మోడీ.. సిద్ధరామయ్య ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కులాలు, మతాల ఆధారంగా అన్నదమ్ముల మధ్య కూడా కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని మోడీ మండిపడ్డారు. బసవేశ్వరుడు నడయాడిన నేలలో విభజన రాజకీయాలు చెల్లవన్నారు. తనకు సిద్ధరామయ్య లీగల్ నోటీసులు పంపడంపై మోడీ స్పందిస్తూ.. కర్నాటక ప్రభుత్వంలో అవినీతి మకిలి అంటని ఒక్క మంత్రి పేరు చెప్పగలరా అని సవాల్ చేశారు. రాహుల్ గెలిపిస్తాడని కాంగ్రెస్ పార్టీలో ఒక్కరికీ నమ్మకం లేదన్నారు. ధరావతు దక్కించుకునేందుకు రాహుల్ తల్లి సోనియా గాంధీని తెరపైకి తెచ్చారన్నారు. కాంగ్రెస్ నేతలు ముందే ఓటమి అంగీకరించారని, అందుకే ప్రచారం మాని సాకులు వెతికే పనిలో పడ్డారన్నారు.
భరతమాత ప్రతిష్ట పరిరక్షించుకునేందుకు బీజేపీకి ఓటు
మరోవైపు, ఆరెస్సెస్ కర్నాటకలో జోరుగా ప్రచారం చేస్తోంది. నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున ఆరెస్సెస్ గప్ చుప్గా తన పని తాను చేసుకుపోతోంది. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ఆరెస్సెస్ కార్యకర్తలు ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లు మీడియా దృష్టికి వచ్చింది. భరతమాత ప్రతిష్టను పరిరక్షించుకోవడానికి బీజేపీని గెలిపించాలని ఆరెస్సెస్ డాక్యుమెంట్లో పేర్కొంటూ వాటిని పంచుతున్నారు.
విస్తృత ప్రచారం
ఒక్కో ఆరెస్సెస్ కార్యకర్త విస్తృతంగా ప్రచారం చేయాలని, కాంగ్రెస్, ఇతర పార్టీలు హిందూమతాన్ని, హిందూ నాయకులను మంట కలిపేందుకు ప్రయత్నిస్తున్నాయని డాక్యుమెంట్లో పేర్కొని దానిని ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. ముస్లిం, క్రైస్తవుల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్, ఇతర పార్టీలు పాటుపడుతున్నాయని అటువంటి పార్టీలకు ఓటు వేయవద్దని ఆరెస్సెస్ కార్యకర్తలు చెబుతున్నారట. హిందువులను చీల్చే కుట్రలు చేస్తున్నారని చెబుతున్నారట.