మరోసారి ఈడీ ముందుకు రాహుల్ - కాంగ్రెస్ సత్యాగ్రహ : రాష్ట్రపతి వద్దకు..!!
కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ మరోసారి ఈడీ ముందుకు రానున్నారు ఇప్పటికే దాదాపు 30 గంటల సుదీర్ఘ విచారణ రాహుల్ ఎదుర్కొన్నారు. శుక్రవారం విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేయగా.. మూడు రోజుల సమయం కోరారు. తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ క్రమంలో 17న కాకుండా 20న విచారణకు హాజరయ్యేందుకు మినహాయింపును ఇవ్వాలని కోరారు. ఇప్పటికే మూడుసార్లు ఈడీ కాంగ్రెస్ నేతను విచారించింది. రాహుల్ గాంధీ ఈడీ ముందుకు విచారణ వెళ్లిన సమయంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు కొనసాగిస్తున్నాయి.
ఇక, సోమవారం దేశ వ్యాప్తంగా సత్యాగ్రహకు కాంగ్రెస్ నిర్ణయించింది. రాహుల్ పట్ల కేంద్రం కక్ష్య పూరితంగా వ్యవహిరిస్తుందంటూ ఆందోళనలతో పాటుగా అగ్నిపథ్ వ్యవహారంలో నిరసనలకు కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రతీకార రాజకీయ దాడులు, అగ్నిపథ్కు వ్యతిరేకంగా లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు శాంతియుతంగా సోమవారం నిరసనలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. అగ్నిపథ్ నిర్ణయానికి వ్యతిరేకంగా సీడబ్ల్యూసీ నేతలు..కాంగ్రెస్ ఎంపీలు ఆదివారం జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ నిర్వహించారు.
సోమవారం సైతం జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నేతలు,కార్యకర్తల సత్యాగ్రహ దీక్ష కొనసాగనుంది. అయితే, ఈ రోజు అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ పట్ల కేంద్రం యొక్క ప్రతీకార, కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా నిరసన చేయనున్నారు. దీంతో పాటుగా ఈ సాయంత్రం రాష్ట్రపతిని కలవాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు నిర్ణయించారు. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలవనున్న కాంగ్రెస్ నేతల బృందానికి ఇప్పటికే అప్పాయింట్ ఖరారైంది.
రాహుల్ గాంధీ ఈడి విచారణ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం,కాంగ్రెస్ ఎంపీలపై ఢిల్లీ పోలీసులు జరిపిన దాడులపై రాష్ట్రపతికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఇటు, భారీ నిరసనలు వ్యక్తం అవుతున్నా.. కేంద్రం మాత్రం అగ్నిఫథ్ విషయంలో వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పింది. నియామక షెడ్యూళ్లను ఖరారు చేసింది. నిరసనల్లో పాల్గొనే వారికి ఆర్మీ ఉద్యోగాల్లో అవకాశం ఉందని త్రివిధ దళాలకు చెందిన అధికారులు స్పష్టం చేసారు.