చెల్లెమ్మ చెయ్యి పట్టుకుని నడవనున్న రాహుల్..! అన్న తో కలిసి అమేధీలో ప్రియాంక పర్యటన ..!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : కాంగ్రెస్ రాజకీయాల్లో రాజీనామాల పర్వం కొనసాగుతున్న తరుణంలో రాహుల్ గాందీ అమేథీ పర్యటన ఆసక్తి రేపుతోంది. అమేథీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. ఈనెల 10న ఆయన అమేథిలో ఒకరోజు పర్యటించనున్నారు. ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం రాహుల్ వెంట వెళ్లే అవకాశాలున్నట్టు పార్టీ నేత ఒకరు తెలిపారు. అమేథీలో ఇటీవల ఓటమి చవిచూసిన రాహుల్ గాంధీ ఆ నియోజకవర్గంలో పర్యటించనుడటం ఇదే ప్రథమం.
కాంగ్రెస్ పార్టీకి 1980 నుంచి అమేథీ నియోజకవర్గం కంచుకోటగా నిలిచింది. అయితే, ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాహుల్పై బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 55,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇదే నియోజకర్గం నుంచి 2014లో స్మృతి ఇరానీపై రాహుల్ లక్షకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. అంతకుముందు అమేథీ నియోజకవర్గానికి తొలిసారి 1989లో సంజయ్ గాంధీ, ఆయన విమానా ప్రమాదంలో మరణించడంతో 1991లో రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. రాజీవ్ హత్య తర్వాత సోనియాగాంధీ 1999లో అమేథీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004 నుంచి 2018 వరకూ రాహుల్ వరుసగా మూడుసార్లు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రాహుల్ అమేథీలో ఈసారి ఓటమి చవిచూసినా కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి భారీ ఆధిక్యంతో గెలిచారు.

ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి కాంగ్రెస్ బయటపడినట్టు లేదు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఆయన బాటలోనే ముంబై కాంగ్రెస్ చీఫ్ మిలింద్ డియోరా, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. ఇక ఎన్నికల ముందే రాజీనామా చేస్తానని బెదిరింపులకు దిగిన మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూడా అదే బాటలో నడిచారు. అయితే, లోక్సభ ఎన్నికల సమయంలో సీట్ల పంపకంలో తన మాట చెల్లుబాటు కావడం లేదనే అసహనంతో కాకుండా రాహుల్ రాజీనామా అనంతరం ఆయన పదవికి గుడ్బై చెప్పడం గమనార్హం. అయితే, ఈయేడు చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతల వైఖరి బీజేపీకి మరింత బలం చేకూర్చేదిగా తయారైంది.












Click it and Unblock the Notifications