షరామామూలే: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా... తిరస్కరించిన హస్తం పార్టీ
ఎన్నికల్లో ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అయితే షరా మామూలుగానే ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది. రాహుల్ నాయకత్వంలోనే పార్టీ బలోపేతం అయ్యిందని సభ్యులు చెప్పారు. ఇది ఒక సవాలుగా తీసుకుని భవిష్యత్తులో మరింత రాటుదేలుతామని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. ఢిల్లీలో జరిగిన సీడబ్లుసీ సమావేశంలో తన రాజీనామా లేఖను సమర్పించారు రాహుల్ గాంధీ.
ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు 52 స్థానాలు మాత్రమే వచ్చాయి. 2014లో 44 స్థానాలు మాత్రమే కాంగ్రెస్కు వచ్చాయి. 18 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవడంలో విఫలమైంది. ఇక సీడబ్ల్యూ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతారని భావించినప్పటికీ వారు మాట్లాడకుండా ముఖం చాటేశారు.
ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు మెల్లగా ఒక్కొక్కొటిగా బయటకు వస్తోంది. కారణాలను పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. రాఫెల్ పై పదే పదే మాట్లాడారు కానీ.. దాన్ని ప్రజల ముందు నిరూపించలేకపోయారని కాంగ్రెస్ పార్టీలో కొందరు చర్చించుకుంటున్నారు. అంతేకాదు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడం.. అదేసమయంలో బీజేపీ బోఫోర్స్ అంశాన్ని లేవనెత్తడంలాంటివి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాయని ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నరేంద్రమోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వంటివి కాంగ్రెస్కు కలిసి రాలేదు. ఇక రాహుల్ గాంధీకి ఈ ఎన్నికల ఫలితాలు రెండోసారి అతిపెద్ద షాక్ను ఇచ్చాయి. ముందుగా 2014లో ఓటమి, కానీ ఆ సమయంలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా లేరు. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ సొంత నియోజకవర్గం అమేథీలో కూడా ఓటమి పాలవడం కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది.