కేజ్రీ చేస్తున్నది శూన్యం.. ఇంట్లో కరోనా మృతురాలి శవం ఉన్నా.. జర్నలిస్ట్ సంచలన వీడియో..
కరోనా వైరస్ సోకి హోమ్ క్వారెంటైన్లో ఉన్న ఓ జర్నలిస్ట్ ఆవేదనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో షేర్ చేశారు. అత్యంత దయనీయ పరిస్థితుల్లో తమ కుటుంబం క్వారెంటైన్లో ఉందని.. కేజ్రీవాల్ ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని వీడియోలో ఆ జర్నలిస్ట్ వాపోయారు. ఇంట్లో ఓ వ్యక్తి కరోనా సోకి చనిపోయినా.. అధికారులెవరూ పట్టించుకోలేదని వాపోయారు. తాను ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తనకు ట్రీట్మెంట్ అవసరమని విజ్ఞప్తి చేశారు.
ఇదీ ఆ జర్నలిస్ట్ ఆవేదన..
'మా ఇంట్లో అందరికీ కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. గత 10 రోజుల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. నా భార్య తండ్రి కరోనాతో మృతి చెందాడు. రెండు రోజుల క్రితం ఆమె తల్లి కూడా చనిపోయింది. కానీ అధికారులెవరూ పట్టించుకోలేదు. దీంతో చాలాసేపు మృతదేహం ఇంట్లోనే ఉంది. చివరకు ఓ అంబులెన్సును తీసుకొచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు.' అని అజయ్ ఝా అనే ఆ జర్నలిస్ట్ చెప్పుకొచ్చారు.

ప్రభుత్వం చేస్తున్నది శూన్యం..
తన వీడియోలో కేజ్రీవాల్ సర్కార్పై అజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం భగవంతుడి మీద భారం వేసి చేతులు దులుపుకుందన్నారు. 'అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. కానీ వాస్తవం అందుకు పూర్తి విరుద్దంగా ఉంది. ప్రభుత్వం చేస్తున్నది శూన్యం. ఇప్పుడు అంతా ఆ భగవంతుడి చేతిలో ఉంది. నేను,నా కుటుంబం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. మాకు 9,5 ఏళ్ల వయసున్న ఇద్దరు పాపలు ఉన్నారు. నా భార్య ఇప్పటికే మానసికంగా కుంగిపోయింది. నేను ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. కానీ నాకు ట్రీట్మెంట్ కావాలి.' అని ఆ జర్నలిస్ట్ చెప్పుకొచ్చారు.

రాహుల్ భరోసా..
' అజయ్ లాంటి పరిస్థితే అనుభవిస్తున్న లక్షలాది మంది మా సోదర సోదరీమణులారా.. మీ బాధను మేము పంచుకుంటాం. మిమ్మల్ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఐక్యంగా ఈ సమస్యను అధిగమిద్దాం.' అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కాగా,ఢిల్లీలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. జులై 31 నాటికి ఒక్క ఢిల్లీ నగరంలోనే 5.5లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అప్పటివరకూ 80వేల పడకలు అవసరమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని ఆస్పత్రులను ఢిల్లీ వాసుల కోసమే రిజర్వ్ చేసింది.












Click it and Unblock the Notifications