Railway Budget 2023 : రైల్వేలకు రూ.2.4 లక్షల కోట్లు- భారీగా వందే భారత్ ల రాక !
కేంద్రం ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ కు రూ.2.4 లక్షల రూపాయల మేర కేటాయింపులు చేసింది. ఇందులో వందే భారత్ రైళ్లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది.
2023-24 ఆర్ధిక సంవత్సరానికి రైల్వే బడ్జెట్ ను కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టారు. ఇందులో రైల్వేలకు రూ.2.4 లక్షల కోట్ల రూపాయల మూలధన వ్యయాన్ని చేయబోతున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 2023లోగా 75 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే 200 వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీకి టెండర్లు పిలుస్తామని కూడా ప్రకటించింది.
భారతీయ రైల్వే నెట్ వర్క్ లో శతాబ్ది ఎక్స్ ప్రెస్ లను వందే భారత్ ఎక్స్ ప్రెస్ లతో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో వందే భారత్ చైర్ కార్స్ శతాబ్ది స్ధానాన్ని భర్తీ చేయబోతున్నాయి. అలాగే రాజధాని ఎక్స్ ప్రెస్ ను వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ లు భర్తీ చేయబోతున్నట్లు ఆర్ధికమంత్రి సంకేతాలు ఇచ్చారు. దీంతో వచ్చే ఆర్దిక సంవత్సరం రైల్వేల్లో పెను మార్పులకు దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో అంటే యూపీఏ పాలన చివరి ఏడాదిలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ కు 9 రెట్లు అధికంగా తాము కేటాయింపులు చేసినట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ గొప్పగా చెప్పుకున్నారు.

రైల్వేలకు ఇది అత్యధిక నిధుల కేటాయింపని, ఈ ఏడాది రైల్వే బడ్జెట్లో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు ఆర్ధికమంత్రి నిర్మల తెలిపారు. త్వరలో వందే భారత్ హైస్పీడ్ రైళ్లను ప్రారంభించడంపై దృష్టి సారించనున్నట్లు ఆమె వెల్లడించారు.
ఈ ఏడాది కేటాయించిన నిధులు కొత్త ట్రాక్లను వేయడానికి, సెమీ-హై-స్పీడ్ వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచడానికి, హైడ్రోజన్తో నడిచే రైళ్లను అలాగే అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టును ప్రవేశపెట్టడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications