రైల్వే శాఖలో ప్రక్షాళన: ప్రతి మూడు రోజులకు ఒకరి తొలగింపు, 16 నెలల్లో 177 మంది
న్యూఢిల్లీ: భారతరైల్వే ప్రక్షాళన ప్రారంభించింది. పనితీరు సరిగా లేని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులను తొలగించేస్తోంది రైల్వే శాఖ, గత 16 నెలల్లోనే 177 మంది ఉద్యోగులను తొలగించడం గమనార్హం. అంటే, 2021 జులై నుంచి దాదాపు రోజుకు ముగ్గురు ఉద్యోగుల చొప్పున తొలగించింది.
139 మంది అధికారులకు వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వగా.. 38 మందిని విధుల నుంచి తొలగించేసింది. బుధవారం ఇద్దరు సీనియర్ గ్రేడ్ అధికారులను కూడా తొలగించినట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. వీరిలో ఒకరు హైదరాబాద్లో రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడగా, రాంచీలో మరొకరు రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
పనిచేయడం లేదా ఇంట్లో కూర్చోండి అంటూ ఇప్పటికే రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఉద్యోగులకు తేల్చి చెప్పారని సదరు అధికారి తెలిపారు. జులై 2021 నుంచి ప్రతి మూడు రోజులకు ఒక అవినీతికి పాల్పడిన లేదా పనిచేయకుండా ఉన్న ఉద్యోగిని తొలగిస్తామని చెప్పారు. శిక్షన సేవల నిబంధనల్లోని రూల్ 56(జే)ను ఉపయోగించి ఈ చర్యలు తీసుకుంటామన్నారు.
ఉద్యోగులను తొలగించే ముందు కనీసం 3 నెలల నోటీసు ఇవ్వడం లేదా సమాన కాలానికి చెల్లింపులు చేయడం జరుగుతుందని వివరించారు. పనిచేయకుండా ఊరికే జీతాలు తీసుకునేవారికి రైల్వే శాఖలో స్థానంలేదని స్పష్టం చేశారు. స్వచ్ఛంద విరమణ తీసుకుంటూ రెండు నెలల జీతంతో సమానమైన వేతనం చెల్లించబడుతుంది. నిర్బంధ పదవీ విరమణ చేయిస్తే ప్రయోజనాలుండవని వెల్లడించారు.