మినీ వందే భారత్ రైళ్లు- 8 బోగీలతో: ఏపీలో ఈ రెండు రూట్లల్లో..!!
న్యూఢిల్లీ: ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోన్న అంశం- వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు. పలు రాష్ట్రాల్లో ఈ రైళ్లు పట్టాలెక్కాయి. ఇప్పటివరకు ఎనిమిది రైళ్లు వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్నాయి. ఈ సిరీస్ లో ఎనిమిదో రైలు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య తిరుగాడుతోంది. మిగిలిన రైళ్లతో పోల్చుకుంటే గరిష్ఠంగా మూడింతల వేగంతో- పరుగులు పెడుతోండటంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్నాయి ఇవి.
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీల నిషేధంపై ఏపీ హైకోర్టులో..!!
ఒక్క రోజులో..
సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య సంక్రాంతి పండగ సందర్భంగా పట్టాలెక్కింది ఎనిమిదో వందే భారత్ ఎక్స్ ప్రెస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్. ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తుంది. గరిష్ఠంగా ఎనిమిదిన్నర గంటల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి చేరుకోవచ్చు.
రోజురోజుకూ..
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. వాటి వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉంటోంది. ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ల రేట్లు రెట్టింపు అయినప్పటికీ ప్రయాణికులు ఏ మాత్రం తగ్గట్లేదు. సమయం, వేగానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. వివిధ నగరాల మధ్య వందలాది కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించే విషయంలో సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో వందే భారత్ రైళ్లపై ఆధారపడుతున్నారు.
టయర్ 2/3 నగరాల మధ్య..
ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం- కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వాటి సంఖ్యను పెంచనుంది. ఈ మేరకు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలను పంపించాలని ఆదేశించింది. దీనిపై రైల్వే బోర్డు కసరత్తు సైతం పూర్తి చేసినట్లు చెబుతున్నారు. టయర్ 2/3 నగరాల మధ్య తక్కువ కిలోమీటర్ల దూరంలో రాకపోకలు సాగించడానికి అనువుగా ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తోంది.
మినీ వందే భారత్..
ఈ క్రమంలో చిన్నస్థాయి నగరాల మధ్య రాకపోకలు సాగించడానికి అనువుగా మినీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిది బోగీలు మాత్రమే ఉండేలా దీన్ని డిజైన్ చేసింది రైల్వే బోర్డు. ఇప్పుడున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఉండే బోగీల సంఖ్య 16. ఇందులో రెండు ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్స్ కాగా.. మిగిలినవన్నీ సాధారణమైనవి.
నాలుగైదు గంటల్లో..
దీనికి భిన్నంగా ఎనిమిది బోగీలతో మినీ వందే భారత్ ను తక్కువ దూరం గల నగరాల మధ్య ప్రవేశపెట్టడానికి కేంద్రం చర్యలు తీసుకుంది. నాలుగైదు గంటల్లో గమ్యస్థానం చేరేలా ఉండే నగరాల మధ్య ఈ ప్రొటొటైప్ తరహా రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానుంది. ఏపీలో విజయవాడ-విశాఖపట్నం, గుంతకల్లు-తిరుపతి లేదా తిరుపతి-చెన్నై, అటు విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య వీటిని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని కేంద్ర బడ్జెట్ లో ప్రకటించే అవకాశం ఉంది.
చెన్నై కోచ్ ఫ్యాక్టరీలో..
ఈ ప్రొటోటైప్ మినీ వందే భారత్ రైలు బోగీలు చెన్నైలోని రీజినల్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మాణ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వందే భారత్ కోచ్ లను తయారు చేయడానికి 110 నుంచి 120 కోట్ల రూపాయలు వ్యయం అవుతాయి. మినీ వందే భారత్ తో పోల్చుకుంటే ఈ సంఖ్య 50 కోట్ల రూపాయలకు మించకపోవచ్చని రైల్వే బోర్డు అంచనా వేసింది. దీనికి అనుగుణంగానే తక్కువ ఛార్జీలను అమలు చేయొచ్చని భావిస్తోంది.