రాజస్థాన్ ఎన్నికలు: 70 శాతం మంది ఎమ్మెల్యేలు సచిన్ పైలట్ వైపు మొగ్గు
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా అల్వార్ జిల్లా రామ్ఘర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగిన బీఎస్పీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆ ఎన్నిక వాయిదా పడింది. 199 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఇందులో కాంగ్రెస్, మిత్రపక్షాలు 100 స్థానాలు గెలుచుకుంది. 2013తో పోలిస్తే 79 స్థానాలు ఎక్కువగా వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ కేవలం 13 సీట్లలో గెలిచింది. బీజేపీ 2013లో 163 స్థానాల్లో గెలవగా, ఇప్పుడు 71 స్థానాలకు పరిమితమైంది.
రాజస్థాన్లో ముఖ్యమంత్రి రేసులో పలువురు ఉన్నారు. ఇందులో సచిన్ పైలట్ వైపు 70 శాతం మంది ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ఇక్కడి నుంచి మూడుసార్లు సీఎంగా పని చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్గా సచిన్ పైలట్ ఉన్నారు. వీరిద్దరు ప్రధానంగా రేసులో ఉన్నారు.
అయితే పార్టీ చాలా తక్కువ మార్జిన్తో గెలిచినందున రాష్ట్ర పగ్గాలు అశోక్ గెహ్లాట్కు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సచిన్ పైలట్ అయిదేళ్లుగా పార్టీ బాధ్యతలు తీసుకుని ముందుకు నడిపిస్తున్నప్పటికీ ఆయనకు సీఎం పదవి దక్కకపోవచ్చని కూడా వాదనలు వినిపించాయి.
ఇరువురు నేతలు సీఎం రేసులో ఉన్నప్పటికీ మొదటి నుంచి సమన్వయంతో ముందుకు నడిచారు. నిన్న ఫలితాలు వెలుడిన తర్వాత కూడా అశోక్ గెహ్లాట్.. సచిన్ పైలట్ ఇంటికి వెళ్లారు. ఇద్దరు కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రచారం సమయంలోనూ కలిసి మెలిసి ప్రచారం నిర్వహించారు.
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో దాదాపు 70 శాతం మంది సచిన్ పైలట్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.