రాజస్థాన్లోనే అత్యధిక రేప్ కేసులు, సగటున 77: మహిళలపై జరుగుతున్న నేరాలపై ఎన్సీఆర్బీ రిపోర్టు
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి రోజు ఏదో ఓ మూల మహిళపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా నిత్యం సరాసరి 77 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని జాతీయ నేర గణాంకాల బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించింది. ఇలా ఏడాదిలో మొత్తం 28,046 ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిపింది. అయితే, మహిళలపై జరుగుతోన్న నేరాలు 2019 కంటే కాస్త తగ్గినట్లు ఎన్సీఆర్బీ పేర్కొంది.
మహిళలపై నేరాల విభాగంలో 2020 సంవత్సరంలో మొత్తం 3,71,503 కేసులు నమోదు కాగా, అంతకుముందు ఏడాది అంటే 2019లో ఈ సంఖ్య 4,05,325గా ఉన్నట్లు ఎన్సీఆర్బీ తెలిపింది. కాగా, దేశంలో 2020 సంవత్సరంలో కరోనా ఉధృతి కారణంగా చాలా వరకు లాక్డౌన్ ఆంక్షలు కొనసాగాయి. అయినప్పటికీ అత్యాచారం ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగించే విషయమే.
2020లో దేశంలో నమోదైన మొత్తం అత్యాచార కేసుల్లో అత్యధికంగా రాజస్థాన్ రాష్ట్రంలో 5310 కేసులున్నాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో 2769, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2339, మహారాష్ట్రలో 2061, అస్సాంలో 1657 రాష్ట్రాల్లో అధికంగా చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 997 అత్యాచార కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్బీ తన నివేదికలో వెల్లడించింది.
మహిళలపై జరుగుతున్న నేరాల్లో అత్యధికంగా 1,11,549 కేసులు భర్త లేదా బందువుల విభాగంలో నమోదైనవి కాగా, 62వేల కేసులు కిడ్నాప్ కేసులే ఉన్నాయి. మరో 85,392 కేసులు మహిళల మర్యాదకు భంగం కలిగించినవి, కాగా, 3741 కేసులు అత్యాచార యత్నం కేసులుగా నమోదయ్యాయి. అదే ఏడాది దేశ వ్యాప్తంగా 105 యాసిడ్ దాడి కేసులు నమోదు కావడం గమనార్హం.
ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం.. 2020లో మొత్తం 28,046 అత్యాచార ఘటనలు చోటు చేసుకోగా.. 28,153 మంది బాధితులుగా మారారు. వీరిలో 25,498 మంది 18 ఏళ్లకు పైబడినవారు కాగా, 2655 మంది మైనర్లే కావడం శోచనీయం. 2019లో 32,033 కేసులు, 2018లో 33,356 కేసులు, 2017లో 35,559 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 2016లో అత్యధికంగా దేశ వ్యాప్తంగా 38,947 అత్యాచార కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది.