అమానుషం... యువకుడి కాళ్లు,చేతులు కట్టేసి దాడి... బలవంతంగా మూత్రం తాగించిన అత్త,మామ
రాజస్తాన్లో దారుణం వెలుగుచూసింది. ఓ యువకుడి పట్ల అతని దూరపు బంధువులు అమానుషంగా ప్రవర్తించారు.అతని కాళ్లు,చేతులు కట్టేసి దాడికి పాల్పడ్డారు.ఆపై బలవంతంగా మూత్రం తాగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగుచూసింది. ఈ అమానుష ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఆ యువకుడు తమ ఇంటి మహిళపై అత్యాచారానికి పాల్పడటం వల్లే దాడి చేయాల్సి వచ్చిందని అతని బంధువులు చెప్పారు. బాధిత యువకుడి అన్న మాత్రం అకారణంగానే తన తమ్ముడిపై దాడి చేశారని ఆరోపిస్తున్నాడు.

అసలేం జరిగింది...
రాజస్తాన్లోని కోటా జిల్లాకు చెందిన 22 ఏళ్ల ఓ యువకుడిపై సెప్టెంబర్ 14న అతనికి అత్త,మామ వరుసయ్యే దూరపు బంధువులు దాడికి పాల్పడ్డారు.తమ ఇంట్లోనే యువకుడి కాళ్లు,చేతులు కట్టేసి నిర్బంధించారు.అతనిపై విచక్షణారహితంగా దాడి చేయడమే గాక బలవంతంగా మూత్రం తాగించారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వెలుగుచూడగా... దాడికి పాల్పడినవారే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆ యువకుడిపై ఫిర్యాదు చేశారు. అతను తమ ఇంట్లోకి అక్రమంగా చొరబడి.. తమ ఇంటి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

యువకుడి అన్న వాదన మరోలా...
మరోవైపు ఆ యువకుడి అన్న వాదన మరోలా ఉంది. ఆ వివరాల ప్రకారం... అత్త,మామ వరుసయ్యే ఇద్దరు దూరపు బంధువులు ఈ నెల 14న ఆ యువకుడిని వారి ఇంటికి పిలిచారు.అత్త,మామ ఆహ్వానం మేరకు అదే రోజు అతను జగ్పురా గ్రామంలోని వారి ఇంటికి వెళ్లాడు.అక్కడ అకారణంగా అతని కాళ్లు,చేతులు కట్టేసిన అత్త,మామ రాత్రంతా ఇంట్లోనే నిర్బంధించారు. అతనిపై దాడి చేసి బలవంతంగా మూత్రం తాగించారు.అతని వద్ద ఉన్న రూ.22వేలు లాగేసుకున్నారు. ఆ మొత్తం తతంగాన్ని సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించారు. అయితే అది పొరపాటున ఆన్లైన్లో ప్రత్యక్షమైంది.

ఆ దంపతులపై కేసు నమోదు
బాధిత యువకుడు గుజరాత్లోని అహ్మదాబాద్లో పనిచేస్తున్నాడు. కుటుంబంతో గడిపేందుకు ఇటీవలే అహ్మదాబాద్ నుంచి కోటాకు వచ్చాడు. వచ్చిన కొద్దిరోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. తన తమ్ముడిపై అకారణంగా దాడి చేయడమే గాక... అతని పైనే కేసులు పెట్టించారని బాధిత యువకుడి సోదరుడు వాపోయాడు.తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.ఘటనపై కోటా డీఎస్పీ ప్రవీణ్ జైన్ మాట్లాడుతూ... యువకుడిపై దాడి చేసిన దంపతులపై కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని... నిజానిజాలు బయటపెడుతామని తెలిపారు.

మహిళలపై క్రైమ్లో టాప్లో రాజస్తాన్...
నేషనల్ క్రైమ్ బ్యూరో 2020 లెక్కల ప్రకారం... మహిళలపై నేరాల్లో ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,ఢిల్లీ,రాజస్తాన్,టాప్లో ఉన్నాయి. వరుసగా రెండో ఏడాది రాజస్తాన్ టాప్ లిస్టులో చేరింది. గతేడాది రాజస్తాన్లో 34,535,ఉత్తరప్రదేశ్లో 49,385,పశ్చిమ బెంగాల్లో 36,439 కేసులు నమోదయ్యాయి. అత్యాచార కేసుల్లో రాజస్తాన్ 5310 కేసులతో టాప్లో ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో 2769 కేసులతో ఉత్తరప్రదేశ్ ఉంది.మైనర్ బాలికలపై అత్యాచారాల్లో మధ్యప్రదేశ్ టాప్లో ఉంది.గతేడాది మధ్యప్రదేశ్లో 3259 మంది మైనర్ బాలికలు అత్యాచారాలకు గురైనట్లుగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2785,ఉత్తరప్రదేశ్లో 2630 కేసులు నమోదయ్యాయి. మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యధికంగా ఢిల్లీలో గతేడాది 967 కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాతి స్థానంలో 409 కేసులతో రాజస్తాన్ రాజధాని జైపూర్ నగరం ఉన్నది.












Click it and Unblock the Notifications