నిన్న అలా...నేడు ఇలా: మోడీ పై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Recommended Video
బీజేపీ దేశానికి ప్రమాదకరంగా పరిణమిస్తుందని భావించి ఆ పార్టీకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న విపక్షాల నిర్ణయంపై తలైవా రజనీకాంత్ స్పందించిన కొన్ని గంటల్లోనే ఆయన మాట మార్చారు. తను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. ఎవరు బలవంతులో ఎవరు బలహీనులో ప్రజలే నిర్ణయిస్తారని తాను చెప్పినట్లు రజనీ వివరణ ఇచ్చారు. ఒక వ్యక్తిపై 10 మంది పోటీ చేస్తున్నారంటే ఎవరు బలవంతులో ఇక్కడే అర్థమవుతోందని చెప్పారు. అంతేకాదు మోడీ బలమైన నాయకుడంటూ కితాబు ఇవ్వడంతో రజనీ వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి.
విపక్షాల మాట నిజమై ఉండొచ్చు
సోమవారం మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు రజనీకాంత్. బీజేపీ దేశానికి ప్రమాదంగా మారబోతోందని ఒకవేళ విపక్షాలు భావిస్తుంటే అది నిజమై ఉండొచ్చని చెప్పారు. అయితే ఈ స్టేట్ మెంట్ పై రజనీకాంత్ ఎలాంటి వివరణ ఇవ్వనప్పటికీ... ఈ వ్యాఖ్యలు చేయడం కొంత ఆశ్చర్యానికి గురిచేసిందని పొలిటికల్ అనలిస్టులు భావించారు. ఎందుకంటే చాలామంది రజనీ పార్టీ బీజేపీ రెక్కల కిందనే పనిచేస్తుందని భావిస్తున్నారు. ఆ సమయంలో రజనీకాంత్ కమలం పార్టీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే తాజాగా రజనీ అలా అనలేదని వివరణ ఇచ్చారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైనదే.. అమలు చేయడంలో విఫలం
త్వరలో కొత్త పార్టీ ప్రకటించనున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2016లో నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని నాడు చెప్పిన రజనీకాంత్.. అది సరిగ్గా అమలు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. పెద్ద నోట్ల రద్దు అమలు విఫలమైందని దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని చెప్పారు.
కఠిన చట్టాలతోనే అత్యాచారాలకు లైంగిక వేధింపులకు చెక్
ఇక దేశంలో లైంగిక వేధింపులు అత్యాచారాలు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చట్టాలు మాత్రమే వీటిని అరికట్టే అవకాశం ఉందని చెప్పారు రజనీకాంత్. రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులను వెంటనే విడుదల చేయాలని రజనీకాంత్ డిమాండ్ చేశారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు నిందితులను విడుదల చేయాల్సిందిగా గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్కు సూచించిందని ఇప్పుడు అది గవర్నర్ పరిధిలోని అంశమని చెప్పారు.