రజనీ రాజకీయాల్లోకి వస్తే తమిళనాడుకు ప్రమాదమే: నాంజిల్ సంపత్ సంచలనం..
రజనీకాంత్ తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం రాష్ట్రానికి ప్రమాదకరమని, యువకులంతా రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకోవాలని నాంజిల్ సంపత్ పిలుపునిచ్చారు.
చెన్నై: తమిళ రాజకీయాల్లోకి తలైవా ఆరంగ్రేటాన్ని అడ్డుకోవడానికి వ్యతిరేక శక్తులు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఆఖరికి సినీ రంగానికి చెందిన భారతీరాజా, కమల్ హాసన్ వంటి ఉద్దండులు కూడా రజనీకి వ్యతిరేకంగా గొంతు కలిపిన సంగతి తెలిసిందే. ఇటు రాజకీయంగాను ఆయన పట్ల వ్యతిరేకతను పెంచడానికి చాలామందే ప్రయత్నిస్తున్నారు.
ఊహించిందే నిజమైంది: 'రజనీ' పొలిటికల్ ఎంట్రీపై ఆందోళనలు, కానీ కబాలి డిసైడెడ్!?
జయలలిత మేనకోడలు దీప.. అసలు రజనీకి రాజకీయాల గురించి ఏం తెలుసంటూ కామెంట్ చేసేశారు. మొత్తంగా తమిళ రాజకీయాల్లో రజనీ అనుకూల-వ్యతిరేక వర్గాల మధ్య స్పష్టమైన చీలిక కనిపిస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో అన్నాడీఎంకె ప్రచార కార్యదర్శి నాంజిల్ సంపత్ సైతం రజనీపై ధ్వజమెత్తారు. రజనీ పొలిటికల్ ఎంట్రీ తమిళనాడుకే ప్రమాదమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రజనీని అడ్డుకోవాలని పిలుపు:
రజనీకాంత్ తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం రాష్ట్రానికి ప్రమాదకరమని, యువకులంతా రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకోవాలని నాంజిల్ సంపత్ పిలుపునిచ్చారు. అన్నాడీఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ విరుదునగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో సంపత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కరుణానిధి నూరేళ్లు బతకాలని:
డీఎంకె అధ్యక్షుడు కరుణానిధి నిండు నూరేళ్లు బతకాలని ఈ సందర్భంగా నాంజిల్ సంపత్ ఆకాంక్షించారు. ఇక కేంద్రం తీసుకొచ్చిన పశుమాంస నిషేధం పట్ల తమిళనాడు ప్రభుత్వం మౌనం వీడాలని సూచించారు.దివంగత సీఎం జయలలిత గురించి హేళనగా మాట్లాడుతున్న ఇళంగోవన్.. పెరియార్ మనవడేనా అన్న సందేహం కలుగుతోందన్నారు.
ఎమ్మెల్యే పదవి తాత్కాళికం:
సభలో శాసనసభ్యులు పాల్గొనకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. తమకు ప్రజాదరణ ఉందని తెలిపారు. కాగా, దినకరన్ అరెస్టు తర్వాత పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీలో కొంతమంది దినకరన్ వర్గంగా మారిపోయారు. పళనిస్వామి వర్గానికి వ్యతిరేకంగా వీరు పనిచేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేలు రాకపోయినా.. తమకు ప్రజాదరణ ఉందని నిన్నటి సభలో సంపత్ అభిప్రాయపడ్డారు.
ఓపీఎస్ వర్గం వృద్ధులది:
మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గాన్ని వృద్ధులతో కూడుకున్న గుంపు అని సంపత్ ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకెలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల విలీనం జరగబోదన్నారు. దీని గురించి ఎవరు మాట్లాడినా ప్రజలను మోసం చేయడమేనన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అన్నాడీఎంకె దానిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉందన్నారు.