సంతోషమే: కరుణానిధిని కలిసిన రజినీ, నాశనమేనంటూ స్టాలిన్ సంచలనం
చెన్నై: ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ బుధవారం సాయంత్రం డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కలిశారు. చెన్నైలోని గోపాలపురంలో కరుణానిధి నివాసానికి వెళ్లిన రజనీకాంత్ ఆయనతో కాసేపు భేటీ అయ్యారు.
అనంతరం రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. కరుణానిధి తనకు చిరకాల మిత్రుడని, మర్యాదపూర్వకంగానే ఆయనను కలిసినట్టు చెప్పారు. ఆయనను కలవడం తనకెంతో సంతోషమని చెప్పారు.

ఆశీస్సుల కోసమే..
దేశంలో కరుణానిధి సీనియర్ రాజకీయనాయకుడని, ఆయనంటే తనకెంతో గౌరవమన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు ఆయన ఆశీస్సులు తీసుకొనేందుకు కలిసినట్టు చెప్పారు. ఆయనతో సమావేశం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

చర్చనీయాంశమే..
రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ఇటీవల రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరుణానిధితో రజనీకాంత్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, విజయ్ కాంత్ కూడా తన పార్టీని పెట్టే ముందు కరుణానిధిని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం గమనార్హం.

ఎన్నికల సమయంలోనే..
కరుణానిధితో రజినీకాంత్ సమావేశంపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ స్పందించారు. రజినీకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? అని ప్రశ్నించగా.. ఎన్నికల సమయంలోనే కూటమి విషయంలో ఆలోచించాలని అన్నారు.

నాశనం చేసేందుకే రజినీ..
అంతేగాక, రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ ద్వారా.. ద్రవిడ రాజకీయాలను నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ద్రవిడ భూమిలో ఎప్పుడూ ఆధ్యాత్మిక రాజకీయాలు పనిచేయవని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications