రజినీ! ఆ దేశానికి వెళ్లొద్దు: తమిళనాట పెరుగుతున్న నిరసనలు
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ శ్రీలంక పర్యటన వివాదాస్పదంగా మారుతోంది. ఆయన పర్యటనను శ్రీలంకలోని తమిళులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎల్టీటీఈని ఊచకోత కోస్తున్నా..
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ శ్రీలంక పర్యటన వివాదాస్పదంగా మారుతోంది. ఆయన పర్యటనను శ్రీలంకలోని తమిళులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎల్టీటీఈని ఊచకోత కోస్తున్నా.. పట్టించుకోని రజినీకాంత్ ఇప్పుడు శ్రీలంక పర్యటనకు ఎందుకు వస్తున్నారంటూ నిలదీస్తున్నారు. ఆయన పర్యటనను అడ్డుకుని తీరుతామంటూ హెచ్చరిస్తున్నారు.

పర్యటన రద్దు చేసుకోవాలి..
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ శ్రీలంక పర్యటనను రద్దు చేసుకోవాలని డీపీఐ ప్రధానకార్యదర్శి తిరుమావళవన్ డిమాండ్ చేశారు. శ్రీలంకలో నివసిస్తున్న తమిళులకు లైకా సంస్థ ఆధ్వర్యంలో 150 కొత్త ఇళ్లను నిర్మించారు. వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమం ఏప్రిల్ 9న జరుగనుంది.

ముఖ్య అతిథిగా రజినీ
ఈ కార్యక్రమంలో రజినీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని లైకా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నగరంలో మీడియాతో మాట్లాడారు తిరుమావళవన్. లక్షలాది మంది తమిళులను ఊచకోతకు గురి చేసిన శ్రీలంక ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయన్నారు.

శ్రీలంకలోనూ రోబో 2.0
కళాకారులు ప్రజలను సంతోషపెట్టే వారుగా ఉండాలని, తమిళులు వ్యతిరేకిస్తున్న శ్రీలంక గడ్డపై తమిళ సూపర్స్టార్ కాలుమోపరాదని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
కాగా, సుమారు రూ.400 కోట్లతో నిర్మించిన రోబో సినిమా సీక్వెల్ ‘రోబో 2.0'ను శ్రీలంకలోనూ విడుదల చేసేందుకు లైకా ప్రొడక్షన్ సిద్ధమైంది.

పునరాలోచనలో రజినీ
మరోవైపు శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతంలో తమిళుల కోసం జ్ఞానం ఫౌండేషన్ 150 ఇళ్లను నిర్మించింది. వాటిని పంపిణీ చేసేందుకు రజినీకాంత్ వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనున్నారు. అయితే రజినీ పర్యటనపై గుర్రుగా ఉన్న కొన్ని గ్రూపులు ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వాటికి డీఎండీకే, జీసీకే పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. కాగా, శ్రీలంక తమిళుల ఆందోళనతో రజనీకాంత్ తన పర్యటనపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications