రజనీకాంత్ రాజకీయాల్లోకి రాడు: సోదరుడి వివరణ
చెన్నై: తమిళ రాజకీయ నేతలంతా అవకాశవాదులు, రజనీ రాజకీయాల్లో ఇమడలేడని, ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా లేదని, అభిమానులు ఆయనపై ఒత్తిడి తీసుకురావద్దని రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. తిరుచ్చి జిల్లా అరియమంగళంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
తన సోదరుడు రజనీ నటించిన ‘లింగ' చిత్రం భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కావేరీ నదీజలాలపై ఇరు ప్రభుత్వాలు వివాదాలు సృష్టించుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. కర్నాటక ప్రభుత్వం రిజర్వాయర్లు నిర్మించుకున్నా, తమిళనాడు ప్రజలకు నీరు ఇవ్వాల్సిందేనన్నారు.
రిజర్వాయర్ల నిర్మాణాలు జరిగితే ఇరు రాష్ట్రాలు లబ్ధి పొందుతారని వెల్లడించారు. రజనీ రాజకీయాల్లోకి రారని సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజకీయం అంటేనే మోసమని, రాజకీయ నేతల మనస్తత్వం సందర్భానుసారంగా అవకాశవాదుల్లా మారుతుందన్నారు. అలాంటి వారి మధ్య రజనీ ఇమడలేరని, ఆయన్ని రాజకీయాల్లోకి రావాలంటూ ఒత్తిడి చేయవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
రజనీ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు తిరుచ్చి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్న వెండి రథం పనులను సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా రజనీ అభిమానులకు ఆయన అభినందనలు తెలిపారు. తాను రాజకీయాల్లోకి వచ్చేది రానిదీ దైవం మీద ఆధారపడి ఉందని రజనీకాంత్ అప్పట్లో చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చే విషయంపై ఎటూ తేల్చడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు ఆ విషయంపై చర్స సాగుతూనే ఉన్నది.