రాజీవ్ కిల్లర్లను వదలొద్దు: సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు నిందితులకు శిక్ష తగ్గించే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో తీర్పును సుప్రీంకోర్టు బుధవారంనాడు రిజర్వ్ చేసుకుంది. రాజీవ్ గాంధీ హంతకులను వదిలిపెట్టకూడదని ఆదేశించింది.
దోషులను రాష్ట్ర ప్రభుత్వాలు వదిలిపెట్టాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. శిక్షల విషయంలో ఉపశమనం కలిగించే అధికారం గానీ హక్కు గానీ రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని చెప్పింది.
వాదనల సందర్భంగా దోషులకు, ముఖ్యంగా మరణశిక్ష పడిన దోషులకు శిక్షలు తగ్గించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాల గురించి ప్రస్తావన వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును మార్చడానికి తమిళనాడుకు అనుమతి ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన తర్వాత విషయం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులకు పడిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. తమిళనాడు ప్రభుత్వం మురుగన్, శంతన్, అరివు అనే ముగ్గురు దోషులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది.
ఆ ముగ్గురితో పాటు నళిని, రాబర్ట్ పియూస్, జయకుమార్, రవిచంద్రన్లను కూడా విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.