చైనాతో టెన్షన్: ఢిల్లీలో హీట్ - త్రివిధ దళాలతో రాజ్నాథ్ రివ్యూ - అజిత్ దోవల్ ‘స్పెషల్’ ఎంట్రీ
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత కొనసాగుతుండటం, మాస్కో వేదికగా జరిగిన విదేశాంగ మంత్రుల భేటీలో పలు కీలక అంగీకారాలు కుదిరిన నేపథ్యంలో ఎల్ఏసీ వద్ద తాజాగా నెలకొన్న పరిస్థితి సమీక్షించి, రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించేందుకు రక్షణ శాఖ కీలక అడుగు వేసింది.
సెక్స్ లో సుఖానుభూతి దైవికమైనది - భోజనం కూడా అలాంటిదే: పోప్ ఫ్రాన్సిస్ - నెట్ఫ్లిక్స్లో సినిమా
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం ఢిల్లీలో అత్యున్నత స్థాయి రివ్యూ సమావేశం జరిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులు ఈ సమావేవంలో పాల్గొన్నారు. చైనాతో దౌత్య పరమైన చర్చలకు సంబంధించి 'స్పెషల్ రిప్రెజెంటేటివ్'గా వ్యవహరించిన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ సైతం భేటీలో పాల్గొనడం గమనార్హం.
గడిచిన నాలుగు నెలలుగా తూర్పు లదాక్ లోని వివిధ వ్యూహాత్మక పాయింట్ల వద్ద చైనా సైన్యం కవ్వింపులకు పాల్పడుతుండటం తెలిసిందే. ఒప్పందాలు, అంగీకారాలకు విరుద్ధంగా ఇటీవల కాల్పులకు కూడా తెగబడటంతో సరిహద్దులో టెన్షన్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో రష్యా రాజధాని మాస్కో వేదికగా జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భారత్, చైనా రక్షణ మంత్రులు, విదేశాంగ శాఖల మంత్రులు కీలక చర్చలు జరిపారు. ఎల్ఏసీ వెంబడి ఏప్రిల్ నాటి యధాస్థితి(స్టేటస్ కో) ఉండాలని భారత్ వాదిస్తుండగా, అందుకు సరేనంటూ తలూపుతోన్న చైనా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ దిశగా కదలడంలేదు.
Recommended Video
మాస్కో వేదికగా గత శుక్రవారం భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. చైనా రక్షణ మంత్రి వెయ్ ఫెంఘేతో సమావేశమయ్యారు. గురువారం(సెప్టెంబర్ 10న) విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యీలు కూడా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో శాంతిస్థాపనకు ముందడుగు పడిందని, ఐదు పాయింట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. సరిహద్దులో సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ''వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ), స్పెషల్ రిప్రెజెంటేటివ్ మెకానిజం వ్యవస్థలను ఇకపైనా కొనసాగించాలని ఇరు దేశాల మంత్రులు అంగీకరించారు. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో సైనిక చర్చలు కొనసాగడంతోపాటు బలగాల ఉపసంహరణ ప్రక్రియను కూడా వేగవంతం చేయాల్సి ఉంటుంది.