ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించండి, కానీ....: రాజ్నాథ్
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న నాయకత్వ సంక్షోభం చివరికి రాష్ట్రంలో అనిశ్చితికి తెరతీసిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటుపై తమ వైఖరి ఎంతమాత్రం మారలేదని, అయితే రాష్ట్రాన్ని విభజించే ముందు ప్రాంతాల మధ్య సమానత్వాన్ని సాధించాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఈ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని తప్పుపట్టారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇప్పటికైనా అన్ని వర్గాలను పిలిచి చర్చించాలని రాజ్నాథ్ డిమాండ్ చేశారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు రాజకీయంగా ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుందని, పలు అంశాలపై సూక్ష్మస్థాయిలో పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని, సమర్థమైన రాజకీయ నాయకత్వం, చాతుర్యం అవసరమని, ఇవి కాంగ్రెస్లో లోపించాయని విమర్శించారు. కాంగ్రెస్ ఇవేవీ పట్టించుకోకుండా రాష్ట్రంలో పరిస్థితులను రోజురోజుకూ దిగజార్చుతోందని ఆయన విమర్శించారు.
విభజన వంటి కీలకమైన అంశాన్ని చేపట్టేముందు రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని అన్నారు. రాష్ట్ర ప్రజలు, వారి ఆస్తుల భద్రత, రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. కోస్తా జిల్లాలను తుఫాను ముంచెత్తే ప్రమాదం ఉందని, ఇలాంటి జాతీయ విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాల నివారణపై ప్రభుత్వ విభాగాలు దృష్టి సారించాలని ఆయన అన్నారు.