లక్నోకు మారనున్న రైతు నిరసనలు-యూపీ, ఉత్తరాఖండ్ లో బీజేపీ ఓటమే లక్ష్యం
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులు వచ్చే ఏడాది జరిగే ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. పశ్చిమబెంగాల్ తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి కోసం ప్రచారం చేసిన రైతులు.. ఇప్పుడు కీలక రాష్ట్రాల్లో బీజేపీని మట్టికరిపించడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు.
రైతు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ మిషన్ ఉత్తర్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ పేరుతో తమ తదుపరి కార్యక్రమాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ మూడు వ్యవసాయ చట్టాల్లో రైతులకు వ్యతిరేకంగా ఏమీ లేదని చెప్తున్నారని, కానీ అందులోని ఓ చట్టంలో రైతులు తమకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సామాగ్రి కార్పోరేట్ సంస్ధల నుంచి కొనుగోలు చేయాలని చెప్తున్నాయని తికాయత్ మండిపడ్డారు. ఈ కొనుగోళ్ల కోసం రైతులు బ్యాంకులపై ఆధారపడాలని ఈ చట్టాలు చెబుతున్నాయన్నారు.
Recommended Video
తాము ఇప్పటికే బెంగాల్లో బీజేపీని ఓడించామని, తమ తదుపరి లక్ష్యం ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికలేనని రాకేష్ తికాయత్ స్పష్టం చేశారు. నల్ల చట్టాల్ని వెనక్కి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. సెప్టెంబర్ 5న ముజఫరాబాద్ లో తమ తొలి మహా పంచాయతీ ఉంటుందని రాకేష్ తికాయత్ ప్రకటించారు. ఢిల్లీ తరహాలోనే త్వరలో లక్నో సరిహద్దుల చుట్టూ తాము మోహరిస్తామని తికాయత్ వెల్లడించారు. ఇందులో అన్ని రైతు సంఘాలు పాల్గొంటాయన్నారు.