కరోనా లేకుంటేనా: రామమందిరం ట్రస్ట్ లోగో: కోటి సూర్యప్రభలతో..రవివంశ తిలకుడిగా..!
లక్నో: కోట్లాదిమంది హిందువులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రామ మందిర నిర్మాణానికి కరోనా వైరస్ బ్రేకులు వేసింది. కరోనా వైరస్ అనేది లేకపోయి ఉంటే.. శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పునాదులు పడి ఉండేవే. ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం.. శ్రీరామనవమి నాడు రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేయాలనేది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ప్లానింగ్. చివరికి అది కాస్తా కార్యరూపం దాల్చలేదు.
ఈ పరిస్థితుల మధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర తన లోగోను ఆవిష్కరించింది. శ్రీరామబంటు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రామమందిరం ట్రస్ట్ లోగోను విడుదల చేసింది. కోటి సూర్యప్రభల మధ్య నగుమోముతో ఉన్న రఘురాముడి ఫొటోను ముద్రించారు. దాని చుట్టూ శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర అనే పేరును రాశారు. పసుపు, ఎరుపు, కాషాయం రంగులతో ఈ లోగోను చిత్రీకరించారు. రామో విగ్రహవాన్ ధర్మః అనే శ్లోకాన్ని రాశారు. శ్రీరామచంద్రుడికి రెండువైపులా ముకుళిత హస్తాలతో ఆసీనుడైన ఉన్న ఆంజనేయ స్వామి ఫొటోలు ఈ లోగోలో కనిపిస్తాయి.
తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ లోగోను ఆవిష్కరించారు. ఇకపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిర్వహించే అన్ని అధికారిక కార్యకలాపాల్లో దీన్ని వినియోగిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహా అధికారికంగా నిర్వహించే ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఈ లోగోను ముద్రిస్తారు. దీన్ని రాజముద్రగా భావిస్తామని, సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రుడే తమ వెన్నంటి ఉంటున్నట్లు భావిస్తామని చంపత్ రాయ్ చెప్పారు.
నిజానికి- శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రామమందిర నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దాదాపు అన్ని ఏర్సాట్లను కూడా పూర్తి చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రత్యేకంగా 15 మందితో కూడిన ట్రస్టుబోర్డును యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంలో రామ్లల్లా విరాజ్మాన్ తరఫున సుప్రీంకోర్టులో వాదించిన కే పరాశరన్ను ఈ ట్రస్టు ఛైర్మన్గా నియమించింది.
అంతా సవ్యంగా సాగుతుందనుకుంటోన్న ఆ పరిస్థితుల్లో కరోనా వైరస్ ఒక్కసారిగా విరుచుకుపడింది. భయానకంగా విస్తరించింది. దీనితో రామమందరి శంకుస్థాపన పనులు వాయిదా పడ్డాయి. మళ్లీ ఎప్పుడు భూమిపూజ చేస్తారనే విషయాన్ని కేంద్రం గానీ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గానీ వెల్లడించలేదు. కరోనా వైరస్ వల్ల నెలకొన్న సంక్షోభ పరిస్థితులు కుదుట పడిన తరువాతే.. రామమందిర నిర్మాణ పనులను చేపట్టవచ్చని అంటున్నారు.