ఇంజినీరింగ్ అద్భుతం- జాతికి అంకితం చేయనున్న మోదీ
New Pamban Bridge: ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి. అయోధ్యలోని రామ్ లల్లా ఆలయం మొదలుకుని దేశవ్యాప్తంగా అన్ని దేవస్థానాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. తెలంగాణలో భద్రాచలం, ఏపీలో ఒంటిమిట్ట ఆలయంలో ఏటేటా అంగరంగ వైభవంగా రామనవమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
మోదీ.. తమిళనాడులో
శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. రామేశ్వరానికి వెళ్లనున్నారాయన. చారిత్రాత్మక రామనాథస్వామివారి ఆలయాన్ని సందర్శించనున్నారు. రామనాథుడి సేవలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

పాంబన్ బ్రిడ్జి జాతికి అంకితం..
అదే రోజున పాంబన్ బ్రిడ్జిని జాతికి అంకితం ఇవ్వనున్నారు మోదీ. 2019లో ఆయనే ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి ఏడాదిలో నిర్మాణ పనులు ఆరంభం అయ్యాయి. ఈ క్రమంలో పాంబన్ బ్రిడ్జి పునర్నిర్మించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యాధునికంగా దీన్ని తీర్చిదిద్దారు.
వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి..
పాంబన్ బ్రిడ్జి పొడవు 2.07 కిలోమీటర్లు. దేశంలో నిర్మితమైన మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి ఇదే. వర్టికల్ లిఫ్ట్ ఎత్తు 72 మీటర్లు. 17 మీటర్ల ఎత్తు ఉన్న నౌకలు దీని కింది నుంచి రాకపోకలు సాగించగలవు. అంటే- నౌకలు వచ్చినప్పుడు వర్టికల్గా ఈ బ్రిడ్జిని పైకి లిఫ్ట్ చేస్తారు. అదే దీని ప్రత్యేకత.
110 సంవత్సరాల కిందట..
పాత పాంబన్ బ్రిడ్జిని 2022లోనే మూసివేసిన విషయం తెలిసిందే. 110 సంవత్సరాల కిందట నిర్మితమైన పాంబన్ పాత వంతెనకు బదులుగా కొత్త బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. 1914లో పాత పాంబన్ వంతెన నిర్మాణం పూర్తయింది. కాలక్రమేణ అది ధ్వంసమౌతూ వచ్చింది. సముద్రపు ఉప్పు నీటికి తుప్పు పట్టడం వల్ల 2022లో దీనిని మూసివేశారు.

స్పాన్ల సంఖ్య..
సముద్ర మట్టం నుండి 3 మీటర్ల ఎత్తు ఉంటుందీ కొత్త పాంబన్ బ్రిడ్జి. స్పాన్ల సంఖ్య.. 100. 99 స్పాన్లు 18.3 మీటర్లు ఉంటాయి. ఒక స్పాన్ 72.5 మీటర్లు. హై-స్ట్రెంగ్త్ స్టీల్, మెరైన్-గ్రేడ్ కాంక్రీట్ను దీని నిర్మాణంలో వినియోగించారు. రిమోట్ మానిటరింగ్తో పూర్తిగా ఆటోమేటెడ్ లిఫ్ట్ మెకానిజంతో పని చేస్తుంది. తుప్పు పట్టని, భూకంపాలకు తట్టుకునేలా ఈ వంతెన నిర్మితమైంది.
గ్రీన్ సిగ్నల్..
గత ఏడాది నవంబర్లో వంతెన రైల్వే సేఫ్టీ కమిషనర్ ఈ వంతెన సామర్థ్యాన్ని పరీక్షించింది. రైళ్ల రాకపోకలకు అనుమతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల రామేశ్వరానికి రైల్ కనెక్టివిటీ పెరుగుతుంది. పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా స్థానిక వ్యాపారాలు పురోగమిస్తాయి.
25 లక్షల మందికిపైగా..
రామేశ్వరం ఆలయానికి ప్రతి సంవత్సరానికి 25 లక్షల మందికిపైగా సందర్శకులు వస్తుంటారు. ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల ఏటా రామేశ్వరానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. సౌత్ రైల్వే నెట్వర్క్లో ఓ కీలక కేంద్రంగా మారుతుంది.
ఇతర ప్రధాన నగరాల నుంచి..
చెన్నై, మధురై, వారణాసి వంటి దేశంలోని ఇతర ప్రధాన నగరాల నుంచి రామేశ్వరానికి అనుసంధానం చేస్తూ మరిన్ని రైలు సర్వీసులు ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోలేదు. పాత వంతెనను వారసత్వ కట్టడంగా పరిగణిస్తారని చెబుతున్నారు. దీన్ని తొలగించకుండా అలాగే ఉంచుతారని సమాచారం.












Click it and Unblock the Notifications