ట్రెండ్ పట్టడంలో ఆయన తర్వాతే - ప్రభుత్వాలు మారినా పాశ్వాన్ పదవి పోలేదు - రీనా శర్మతో రెండో పెళ్లి
భవిష్యత్తును సరిగ్గా అచనా వేయగలిగినవాడే సిసలైన రాజకీయ నాయకుడని భావిస్తే గనుక దేశంలో రామ్ విలాస్ పాశ్వాన్ ను మించిన నేత మరొకరు ఉండరు. పొలిటికల్ ట్రెండ్ ను కరెక్టుగా పట్టుకోవడంలో, రాబోయే మార్పుల్ని ముందే ఊహించి, ఆమేరకు తన పార్టీని సమాయత్తం చేయడంలో పాశ్వాన్ ది ప్రత్యేక శైలి. కాబట్టే కేంద్రంలో ప్రభుత్వాలు మారినా.. ప్రధాన మంత్రులు మారినా.. దశాబ్దాలుగా ఆయన పదవిలోనే కొనసాగగలిగారు.
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దళిత నేతల్లో ఒకరు, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపకుడు, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ 74 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా ఆస్పత్రికే పరిమితమైన ఆయన, ఇటీవల గుండెకు ఆపరేషన్ చేయించుకుననారు. చికిత్స పొందుతూనే గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం అణగారిన వర్గాలకు తీరని లోటని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన పాశ్వాన్ జీవిత విశేషాల్లోకి వెళితే..
డీఎస్పీ ఉద్యోగం కాదనుకుని..
రామ్ విలాస్ పాశ్వాన్ 1946, జూలై 5న బీహార్లోని ఖగారియా జిల్లా లోని షాహర్బన్నీలో జన్మించారు. దుసాద్ సామాజిక వర్గానికి చెందిన ఆయన కోసి కాలేజ్, పిల్కి, పాట్నా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. 1969 లో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, డీఎస్పీగా ఎంపికయ్యారు. అప్పటికే సంయుక్త సోషలిస్ట్ పార్టీ తరఫున అలౌలి (ఖాగారియా) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రభుత్వంగా ఉండటమా? ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగడమా? అని తేల్చుకున్న క్షణం తన జీవితంలో అరుదైన సందర్భమని పాశ్వాన్ చెబుతారు.
ఎమర్జెన్సీలో జైలు జీవితం..
1974 లో రాజ్ నారాయణ్, జయప్రకాష్ నారాయణ్ ల ముఖ్యమైన అనుచరుడిగా పాశ్వాన్ లోక్దళ్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. రాజ్ నారాయణ్, కార్పూరి ఠాకూర్, సత్యేంద్ర నారాయణ్ సిన్హా వంటి అత్యవసరపరిస్థితిని వ్యతిరేకించే నాయకులతో అతను వ్యక్తిగతంగా సన్నిహితంగా మెలిగారు. మొరార్జీ దేశాయ్తో విడిపోయి, లోక్బంధు రాజ్ నరేన్ నేతృత్వంలోని జనతా పార్టీ-ఎస్ లో చేరి పార్టీ అధ్యక్షుడిగా తరువాత దాని ఛైర్మన్గా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపాడు. 1977 లో విడుదలైన తరువాత జనతా పార్టీ సభ్యుడయి, ఆ పార్టీ నుంచే పలు మార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
దళిన విముక్తి ఉద్యమం..
ఓవైపు ఎంపీగా ఎన్నికవుతూనే పాశ్వాన్ 1983లో దళిత విముక్తి, సంక్షేమం కోసం ‘దళిత సేన'ను స్థాపించారు. బీహార్ లో కటిక పేదరికం, తీవ్రమైన అణిచివేతను ఎదుర్కొంటున్న అణగారిన వర్గాలకు పాశ్వాన్ అండగా నిలిచారు. రాజ్యాధికారం ద్వారానే దళితుల జీవితాలు మెరుగుపడతాయని ఆయన బలంగా నమ్మేవారు. ఆ నమ్మకానికి తోడు రాబోయే మార్పులను సరిగ్గా అంచనా వేస్తూ తన ఉనికిని మరింత బలంగా మార్చుకున్నారాయన.
ఆరుగురు ప్రధానులతో..
1989లో వీపీ సింగ్ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా చేరిన రామ్ విలాస్ పాశ్వాన్.. ఆ తర్వాత ప్రభుత్వాలు, ప్రధానులు మారుతూ వచ్చినా పదవిలోనే కొనసాగడం గమనార్హం. వీపీ సింగ్ అనంతరం కొంచెం గ్యాప్ వచ్చినా.. దేవేగౌడ, ఐకే గుజ్రాల్, వాజపేయి, మన్మోహన్ సింగ్, ప్రస్తుత నరేంద్ర మోదీ కేబినెట్లలో పదవులు పొందారు. 2000 సంవత్సరంలో సొంతగా లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)ని స్థాపించి, బీహార్ రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా పనిచేశారు.
వారసుడు చిరాగ్ పాశ్వాన్..
రామ్ విలాస్ పాశ్వాన్ కు ఇద్దరు భార్యలు. తన ఎన్నికల అఫిడవిట్ పై ఫిర్యాదు చేయడం, గొడవలు మరింత ముదరడంతో 1981లో మొదటి భార్యకు విడాకులిచ్చారు. మొదటి భార్య ద్వారా పాశ్వాన్ కు ఇద్దరు ఆడపిల్లలున్నారు. 1983 లో ఎయిర్ హోస్టెస్ అయిన రీనా శర్మను పాశ్వాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. రిచా శర్మ-రామ్ విలాస్ ల తనయుడైన చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీకి వారసుడిగా వ్యవహరించనున్నారు.