నన్ను సొంతవారే బంధిస్తే, పోలీసులే తెచ్చారు: రాంపాల్
చండీగఢ్: వివాదాస్పద బాబా రాంపాల్ గురువారం నాడు కోర్టులో వింత వాదన వినిపించారు. కోర్టు ఆదేశాల మేరకు తాను పోలీసులకు సహకరించాలనుకున్నానని, తన సొంత ఆశ్రమంలోనే అనుచరులు అందుకు అంగీకరించలేదని, తనను బయటకు రాకుండా బంధించారని న్యాయస్థానానికి తెలిపారు. ఆయన తరఫున లాయర్ చెప్పారు. ఆయన వ్యాఖ్యల పైన న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు.
రాంపాల్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి అని చెప్పారు. ఆశ్రమంలో పలువురు ఆయనను బంధించారన్నారు. ఆ కారణంగానే ఆయన కోర్టుకు హాజరు కాలేకపోయారన్నారు. హర్యానా పోలీసులు ఆయనను రక్షించారని చెప్పారు. పోలీసులను రాంపాల్ అనుచరులు ముప్పుతిప్పలు పెట్టగా.. ఆయన బంధీగా ఉంటే, పోలీసులే రక్షించారని చెప్పడం విశేషం.
కాగా, బాబా రాంపాల్ లీలలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. రాంపాల్ను ఆయన భక్తులు దైవాంశ సంభూతుడిగా భావిస్తుంటారు. ఆయన దగ్గర ఎన్నో మహిమలున్నాయని భావిస్తుంటారు. దీంతో ఆయనను ప్రత్యక్ష దైవంగా కొలుస్తుంటారు.
రాంపాల్కు పాలతో స్నానం చేయిస్తారని, ఆ పాలతో తర్వాత ఖీర్ తయారు చేసి భక్తులందరికీ ప్రసాదంలా పంచుతారని మనోజ్ అనే భక్తుడు తెలిపాడు. అయితే అది సరికాదని పాలను ఖీర్ తయారు చేయడానికి వాడేపాలు బాబాకు స్నానం చేయించినవి కాదని, ఆయన ధ్యానం చేస్తుండగా ఆయన తలపై ఓ గొట్టం ద్వారా పోసినవని వేరే భక్తులు చెబుతున్నారు.
ఇదీ కేసు..
2006లో రోహ్తక్ జిల్లాలోని కైన్తోలాలో ఉన్న స్వామీజీ ఆశ్రమంలో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి నమోదయిన హత్య కేసులో ఆయనకు మంజూరు చేసిన బెయిలును రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తులు ఎం జయపాల్, దర్శన్ సింగ్లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.
కోర్టు ధిక్కరణ కేసులో బాబా రాంపాల్ను అరెస్టు చేసినట్లు, అందువల్ల ఆయన బెయిలును రద్దు చేయాలని పేర్కొంటూ హర్యానా అడ్వకేట్ జనరల్, బర్వాలా పోలీసు స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) ఒక దరఖాస్తును కోర్టులో దాఖలు చేసిన తర్వాత బెయిలును రద్దు చేసారు. ఆయనను తక్షణం అరెస్టు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
అనారోగ్య కారణాలను చూపిస్తూ కోర్టు ముందు హాజరు కావడానికి నిరాకరిస్తూ వస్తున్న రాంపాల్ను గురువారం ఉదయం వైద్య పరీక్షల కోసం పంచకులలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన ఆరోగ్య వ్యవస్థలన్నీ నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్న తర్వాత పోలీసులు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఎదుట హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది.
బర్వాలాలోని రాంపాల్ ఆశ్రమంలో ఆయన అరెస్టుకోసం జరిపిన ఆపరేషన్, ఆ సందర్భంగా జరిగిన నష్టం, జనానికి తగిలిన గాయాలు, ఆశ్రమంలోని ఆయుధాలు, మందుగుండు, ఆస్తులకు జరిగిన నష్టం వివరాలను తెలియజేస్తూ ఒక అఫిడవిట్ను దాఖలు చేయాలని హర్యానా పోలీసు చీఫ్ను ఆదేశిస్తూ బెంచ్ కేసును ఈ నెల 28కి వాయిదా వేసింది.
ఆరోపణలపై రాంపాల్
తనపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలని వైద్య పరీక్షలకోసం పోలీసులు తనను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో రాంపాల్ విలేకరులతో అన్నారు.
బర్వాలాలోని స్వామీజీకి చెందిన సత్లోక్ ఆశ్రమంలోని ఆయన శిష్యులంతా ఒక్కొక్కరే బైటికి వస్తూ ఉన్నారు. అంతేకాదు స్వామీజీ, ఆయన అంగరక్షకులు తమను బందీలుగా ఉంచారని చెబుతున్నారు. స్వామీజీ వీరాభిమానులు, ఆయన ప్రైవేట్ కమాండోలకు చెందిన కొంతమంది ఇంకా ఆశ్రమం లోపలే ఉండడంతో 12 ఎకరాలలో విస్తరించి ఉన్న ఆశ్రమంలో పూర్తిస్థాయి సోదాలు చేపట్టే విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరించారు. కాగా, రాంపాల్ పైన కొత్తగా 35 కేసులు నమోదయ్యాయి.