మహిళను చిత్రహింసలకు గురిచేసిన సీమ పాత్ర అరెస్ట్, బీజేపీ నుంచి సస్పెండ్
రాంచీ: తన ఇంట్లో పనిచేసే మహిళను అత్యంత దారుణంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో జార్ఖండ్కు చెందిన బీజేపీ నాయకురాలు సీమా పాత్రాను రాంచీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీమా ఇంట్లో పనిచేసే 29 ఏళ్ల సునీత శరీరం, ముఖంపై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సీమా పాత్రా తనను బంధించి తీవ్రంగా హింసించారని సునీత ఆ వీడియోలో వాపోయింది. కొన్ని సార్లు ఇనుప రాడ్లతో కొట్టేవారని, అలా ఓసారి తన పన్ను కూడా విరిగిపోయిందని, పొమ్మి మీద వేడి చేసిన పేనంతో కూడా వాతలు పెట్టారని కన్నీళ్లపర్యంతమమైంది. ప్రస్తుతం ఆమె నడవలేని, సరిగా మాట్లాడలేని స్థితిలో ఉండటం గమనార్హం.
కాగా, సునీత కొన్నేళ్ల క్రితం రాంచీలోని అశోక్నగర్ ప్రాంతంలో గల సీమా పాత్ర నివాసంలో పనికి చేరింది. సునీతను సీమా చిత్ర హింసలకు గురిచేస్తున్నట్లు సీమ కుమారుడే సమాచారమివ్వడంతో గతవారం పోలీసులు ఆమెను రక్షించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో సీమా పాత్ర ఇంటి నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. రోడ్డు మార్గంలో రాంచీ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా బుధవారం తెల్లవారుజామున పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమెను కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీమా పాత్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని జార్ఖండ్ డీజీపీకి లేఖ రాసింది. సీమా పాత్రా బీజేపీ మహిళా విభాగం జాతీయ వర్కింగ్ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. పనిమనిషి వీడియో వైరల్గా మారిన తర్వాత సీమాను మంగళవారం బీజేపీ సస్పెండ్ చేసింది. ఆమె భర్త మహేశ్వర్ పాత్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. రాజకీయపరంగా మహిళలు, పిల్లల కోసం పోరాటం చేసిన సీమా పాత్ర.. వాస్తవంగా ఓ మహిళను అత్యంత దారుణంగా హింసించడంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు ఆమెతోపాటు బీజేపీపైనా విమర్శలు గుప్పిస్తున్నారు.