కొత్త సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్గా జస్టిస్ రంజన్ గొగోయ్..?
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అక్టోబర్ నెలలో పదవీవిరమణ చేయనున్నారు. దీంతో సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిని ఖరారు చేయాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. సంప్రదాయం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి పోస్టుకు పేర్లను సూచించాల్సిందిగా కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తుంది. కానీ ఈసారి ఇందుకు భిన్నంగా జస్టిస్ దీపక్ మిశ్రానే తన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు పేరును ప్రకటించాలని కోరడం విశేషం.
ఇక అక్టోబర్లో రిటైర్ కానున్న ప్రస్తుత ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా స్థానంలో మరో సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి రంజన్ గొగోయ్ ప్రధాన న్యాయమూర్తి పోస్టు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జస్టిస్ మిశ్రా తర్వాత జస్టిస్ రంజన్ గొగోయ్కు సీనియారిటీ ఉంది. దీపక్ మిశ్రా తర్వాత గొగోయే సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జిగా ఉన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు పాలనా వ్యవహారంపై తిరుగుబావుటా ఎగురవేసిన నలుగురు జడ్జీల్లో రంజన్ గొగోయ్ కూడా ఒకరు.
ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా కేసులను కేటాయించడంలో వివక్ష చూపుతున్నారని మీడియా సమావేశం పెట్టి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసిన నలుగురు సుప్రీంకోర్టు జడ్జీల్లో రంజన్ గొగోయ్ కూడా ఒకరు. ప్రస్తుతం రంజన్ గొగోయ్ వివాదాస్పదమైన NRC కేసును విచారణ చేస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తే... జస్టిస్ మిశ్రా గొగోయ్ పేరు సూచిస్తే ఇక తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంపిక సజావుగా సాగినట్లు అవుతుంది. లేదంటే మళ్లీ వివాదం చెలరేగే అవకాశం ఉంది. అక్టోబర్ 2న జస్టిస్ దీపక్ మిశ్రా పదవీ విరమణ చేయనున్నారు. అయితే అంతకంటే ఒక నెల ముందే తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును ప్రకటించాల్సి ఉంది. 2012లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గొగోయ్ బాధ్యతలు చేపట్టారు. మృదుస్వభావిగా పేరున్నప్పటికీ ఆయన తీర్పు చెప్పే సమయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారన్న పేరుంది.