రేప్ చేశాడు.. ఎనిమిదేళ్ల తర్వాత.. ఆమెనే వివాహం చేసుకున్నాడు
బాధితురాలి విన్నపం మేరకు.. ఆమెపై రేప్ కు పాల్పడిన మనోజ్ బావురీ తిరిగి ఆమెనే వివాహం చేసుకున్నాడు.
పురూలియా: రేప్ కేసులో నిందితుడైన ఓ వ్యక్తి.. తిరిగి అదే బాధితురాలిని ఎనిమిదేళ్ల తర్వాత జైల్లోనే వివాహం చేసుకోవడం విశేషం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పురూలియా జైలులో పోలీసుల సమక్షంలోనే ఈ వివాహం జరిగింది.
అసలు విషయానికొస్తే.. పురూలియా పట్టణానికి చెందిన మనోజ్ బావురీ(30) అదే పట్టణానికి చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసులో దోషి అని తేలడంతో.. 2010 నుంచి అతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
ఇదిలా ఉంటే, మనోజ్ బావురీ దుశ్చర్యకు సదరు బాధిత మహిళ గర్భవతి అయింది. ఆ తర్వాత ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కొడుకు కాస్త పెద్దయ్యాక అందరూ అతన్ని తండ్రెవరు? అంటూ ప్రశ్నించడం.. ఆఖరికి స్కూల్లో చేర్పించడానికి వెళ్లినప్పుడు కూడా ఇదే ప్రశ్న ఎదురవడంతో బాధిత మహిళ తీవ్ర మనస్తాపానికి లోనైంది.
దీంతో నిందితుడే తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా బాధితురాలు ట్రయల్ కోర్టుకు విన్నవించకుంది. బాధితురాలి విన్నపంతో పురూలియా జైల్లో శిక్ష అనుభవిస్తున్న మనోజ్ బావురీకి ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి మనోజ్ అంగీకరించాడు.
అలా.. తాను అత్యాచారానికి పాల్పడిన మహిళనే ఎనిమిదేళ్ల తర్వాత మనోజ్ వివాహం చేసుకున్నాడు. జైలు అధికారులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించి ఈ పెళ్లి జరిపించడంతో.. అత్యాచార ఘటనకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పడింది.