'దిశ' పేరు బయటపెట్టిన వ్యవహారం-రవితేజ, రకుల్ ప్రీత్, శిఖర్ ధావన్ సహా 38 మందిపై కేసు
2019లో హైదరాబాద్ లో శివార్లలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. అత్యాచారం జరిగిన విధానం, అనంతరం హత్యకు సంబంధించి తెలంగాణలోనూ జనాగ్రహం వెల్లువెత్తింది. చివరికి దిశ హంతకులను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు. అప్పటివరకూ ఆమె అసలు పేరుతో పోలీసులు కేసు నమోదు చేసినా ఆ తర్వాత చట్ట ప్రకారం ఆమె పేరు మార్చి 'దిశ'గా పేరు పెట్టారు.
హైదరాబాద్ హత్యాచారం తర్వాత మృతురాలికి పెట్టిన దిశ పేరును వాడకుండా ఆమె అసలు పేరును పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోలీసులు దిశ అని పేరు పెట్టిన తర్వాత కూడా అత్యాచార బాధితుల పేర్లు బయటపెట్టరాదన్న కామన్ సెన్స్ వాడకుండా పలువురు సెలబ్రిటీలు సైతం ఆమె అసలు పేరును తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టారు. ఆమెకు సానుభూతి, నివాళులు ప్రకటించే క్రమంలో వీరు ఈ పోస్టులు పెట్టారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అత్యాచార బాధితురాలి పేరు బయటపెట్టినందుకు వీరిపై ఢిల్లీలో కేసు నమోదైంది.
హైదరాబాద్ అత్యాచార బాధితురాలి పేరు బయటపెట్టినందుకు 38 మంది సినీ నటీనటులు, క్రీడాకారులపై ఢిల్లీలోని ఓ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇందులో తెలుగు సినీ హీరో రవితేజ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, క్రికెటర్లు హర్భజన్ సింగ్, షట్లర్ సైనా నెహ్వాల్, శిఖర్ ధావన్, బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గణ్, అభిషేక్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్, అనుపమ్ ఖేర్ ఉన్నారు.
Recommended Video
వీరంతా చట్ట నిబందనలకు విరుద్దంగా అత్యాచార బాధితురాలి పేరును సోషల్ మీడియాలో షేర్ చేసినందున వీరిపై చర్యలు తీసుకోవాలని గౌరవ్ గులాటీ అనే న్యాయవాది ఢిల్లీలోని స్ధానిక కోర్టుతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించి అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్ తో పాటు ఇతర పోలీసు అధికారులపై విచారణ కొనసాగుతోంది.