మరణించిన ఏనుగుకు న్యాయం చెయ్యండన్న రతన్ టాటా .. వారిని వదిలిపెట్టేది లేదన్న కేంద్ర మంత్రి
కేరళలో గర్భంతో ఉన్న ఏనుగు మరణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అత్యంత దారుణంగా బాణా సంచా తినిపించి ఏనుగు మరణానికి కారణం అయిన అగంతకులు ఎవరు అన్న చర్చ జరుగుతుంది. మానవత్వం లేకుండా ఇలా ప్రవర్తించిన వారిని వదిలిపెట్టవద్దని దేశం ముక్త కంఠంతో నినదిస్తుంది .
Recommended Video

గర్భిణీ ఏనుగు హత్య పట్ల రతన్ టాటా ఆవేదన
ఇక గర్భిణీ అయిన ఏనుగును చంపడం తీవ్రమైన ఘోరంగా పారిశ్రామికవేత్త రతన్ టాటా పేర్కొన్నారు . అంతేకాదు మరణించిన ఏనుగుకు న్యాయం చేయాలని కోరారు.
ఏనుగుకుపేలుడు పదార్ధాలు నింపిన పైనాపిల్ పెట్టి ఏనుగు దారుణ మరణానికి కారణం అయ్యారు కొందరు అగంతకులు. పైనాపిల్ తిన్న ఏనుగు నోటి లోపల పేలుడు పదార్ధాలు పేలటంతో, సైలెంట్ వ్యాలీ ఫారెస్ట్లో నీళ్ళలోకి దిగిన ఏనుగు భరించలేని బాధతో ప్రాణాలు విడిచింది .

మానవ హత్యలకు ఇలాంటి జంతు హత్యలకు బేధం లేదన్న రతన్ టాటా
ఇక ఈ నేపధ్యంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రతన్ టాటా " పేలుడు పదార్ధాలు నింపిన పైనాపిల్ ను ఏనుగుకు ఆహారం ఇవ్వడం ద్వారా ఒక సమూహం అమాయక, ఏ పాపం ఎరుగని ఒక మూగ జీవి, గర్భిణీ అయిన ఏనుగు మరణానికి కారణమైందని తెలిసి నేను బాధపడ్డాను . ఈ దారుణ ఘటనతో షాక్ కు గురవుతున్నాను" అని రతన్ టాటా ట్వీట్ చేశారు.
"అమాయక జంతువులపై ఇటువంటి నేరపూరిత చర్యలు ఇతర మానవులపై చేసిన హత్యల కంటే భిన్నంగా లేవు" అని ఆయన పేర్కొన్నారు.
ఏనుగుకు న్యాయం చెయ్యాలని డిమాండ్
మనుషులను హత్య చెయ్యటం జంతువులను హత్య చెయ్యటం రెండూ భిన్నమైనవి కావు అని ప్రముఖ జంతు ప్రేమికుడు అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అన్నారు. అంతే కాదు కేరళలో మృతి చెందిన ఏనుగుకు న్యాయం జరగాలి అని ఆయన ట్వీట్ చేశారు .ఈ దారుణ హత్యపై వన్యప్రాణి నేర దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తుందని కేరళ ప్రభుత్వం తెలిపింది. ఈ సంఘటనను కేంద్రం కూడా తీవ్రంగా పరిగణించి రాష్ట్రం నుంచి నివేదిక కోరింది.

కేంద్రం సీరియస్ .. ఏనుగును చంపిన వారిని వదిలిపెట్టమన్న మంత్రి జవదేకర్
ఇక కేరళలో ఏనుగు మృతి ఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్రం అందుకు కారణమైన వారిని వదిలిపెట్టబోమని తేల్చి చెప్తుంది . ఈ ఘటనపై దర్యాప్తులో ఏ ఒక్క అంశాన్ని వదిలేది లేదని కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. పైనాపిల్ లో బాణాసంచా తినిపించి మూగజీవాలను చంపడం దారుణం అని భారతీయ సంస్కృతే కాదని ఆయన గురువారం ట్వీట్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదికను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చిందని పేర్కొన్నారు . మే 27 న కేరళలోని పాలక్కడ్ లో ఆకలిగా ఉన్న ఆడ ఏనుగుకు టపాసులు నింపిన పైనాపిల్ పెట్టి దాని ఉసురు తీశారు . ఈ ఘటనకు కారణమైన వారిపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications