అగ్నిపథ్ చిచ్చు వెనుక కీలక కారణాలు-తాత్కాలిక ఉద్యోగాలు, నో పెన్షన్-నో హెల్త్ బెనిఫిట్స్
బీహార్, యూపీ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అగ్నిపథ్ ఆర్మీ ఎంపిక పథకానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు సాగుతున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ కేంద్ర ప్రభుత్వ పథకంపై ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణాలేంటన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కేంద్రం ఈ స్కీమ్ లో భాగంగా ఎంపికయ్యే ఆర్మీ జవాన్లకు ఇవ్వచూపుతున్న ప్రయోజనాలే కారణంగా కనిపిస్తోంది. వీటిపై అసంతృప్తితోనే నిరుద్యోగయువత విధ్వంసాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
అగ్నిపథ్ పథకం
కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆర్మీలో ఎంపికల కోసం కొత్తగా అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా మూడు నెలల్లోనే 45 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ పథకం కింద ఎంపికయ్యే వారిని అగ్నివీరులుగా పిలుస్తామని కూడా తెలిపింది. అంతవరకూ బాగానే ఉన్నా ఈ పథకం కింద అగ్నివీరులకు లభించే ప్రయోజనాల విషయంలోనే అసంతృప్తి మొదలైంది. ముఖ్యంగా దక్షిణాదితో పోలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, అందులోనూ మిలటరీ ఉద్యోగాలపై చైతన్యం ఉండే ఉత్తరాదిలో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి.
అగ్నిపథ్ లో ఏముంది ?
అగ్ని పథ్ పథకంలో భాగంగా ఆర్మీకి ఎంపికైన వారికి కేంద్రం పలు ప్రయోజనాలు ఇస్తోంది. అదే సమయంలో వారి ప్రయోజనాలకు విఘాతం కలిగేలా కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా అగ్నిపథ్ పథకంలో భాగంగా ఎంపికైన జవాన్లలో 75 శాతం మందిని నాలుగేళ్లకే ఇంటికి పంపేయాలని నిర్ణయించడం చిచ్చు రేపుతోంది. కేవలం 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత 15 ఏళ్ల వరకూ కొనసాగించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం నిరుద్యోగ యువతలో ఆందోళన రేపుతోంది. అంతే కాదు అగ్నిపథ్ పథకం ద్వారా ఎంపికైన జవాన్లకు పెన్షన్ ఉండదు. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలూ దక్కవు. ప్రస్తుతం ఆర్మీకి ఇస్తున్న ఎలాంటి ప్రయోజనాలు వారికి దక్కవు. వీరి పదవీకాలం పూర్తి కాగానే సెటిల్ మెంట్ మొత్తం ఇచ్చి పంపేస్తారు. దీంతో అగ్నిపథ్ నిరుద్యోగుల్లో చిచ్చు రేపుతోంది.
దేశవ్యాప్తంగా ఆందోళనలు
అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రకటించిన 48 గంటల్లోనే దీనిపై బీహార్లో ముందుగా అసంతృప్తి మొదలైంది. ఆర్మీ రిక్రూట్ మెంట్ లో కీలకంగా ఉండే బీహార్లో నిరుద్యోగులు.. అగ్నిపథ్ పథకం వల్ల నష్టాల్ని ముందుగానే గ్రహించి ఆందోళనకు దిగారు. ఇప్పుడు ఆ ఆందోళనలు యూపీ, హైదరాబాద్, రాజస్తాన్ కు కూడా తాకాయి. అక్కడి నుంచి దేశంలో ఎక్కడెక్కడికి పాకుతాయో ఎవరికీ తెలియదు. ఈ ఆందోళనల్లో భాగంగా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనకారులు రైళ్లను, రైల్వేస్టేషన్లను టార్గెట్ చేస్తున్నారు. దీంతో బీహార్లో రెండు రైల్వే కోచ్ లు, యూపీలో ఓ రైల్వే కోచ్ తగులబడింది. బీహార్లో రోడ్లపైకి వచ్చి ఆందోళనకారులు రెచ్చిపోతుంటే.. ఇవాళ సికింద్రాబాద్ లోనూ రైళ్లపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడులకు దిగారు. దీంతో కేంద్రం ఇరుకునపడుతోంది.