పోటీ చేయను, ప్రచారం కూడా: కాంగ్రెస్ పార్టీకి అంబరీష్ భారీ షాక్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రెబల్స్టార్ ఎంహెచ్ అంబరీష్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు.
Recommended Video
పోటీ చేయను
మాండ్యా నుంచి పోటీ చేయనని అంబరీష్ తీసుకున్న నిర్ణయంతో మే 12న జరిగే ఎన్నికల్లో మాండ్యా నుంచి వేరొక వ్యక్తిని బరిలో దించాల్సిన అవసరం కాంగ్రెస్కు అనివార్యమైంది. తన వయస్సు అయిపోతోందని, అందువల్లే తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడంలేదని అన్నారు.
ఎన్నికల్లో ప్రచారం చేయనంటూ
మాండ్యా నియోజకవర్గం నుంచి ఎవరితోనైనా నామినేషన్ వేయించాలని పార్టీకి సూచించారు. కర్ణాటక ఎన్నికల్లో మాండ్యా నియోజకవర్గం నుంచి అంబరీష్కు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. కానీ, ఆయన బీ ఫారమ్ మాత్రం తీసుకోలేదు. తన అనారోగ్యం రీత్యా ఎన్నికల్లో ప్రచారం చేయబోనని ఆయన స్పష్టంచేశారు.
ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు
అంతేగాక, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండు నియోజకవర్గాల నుంచి బరిలో నిలవడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని, రాజకీయ నాయకులు మాత్రం నిత్యం పోరాటం చేస్తూనే ఉండాలని సూచించారు.
న్యాయం చేయలేను
కాగా, ఒకవేళ తాను అసెంబ్లీకి ఎన్నికైనా ప్రజలకు న్యాయం చేయలేనని అంబరీష్ అన్నారు. అందువల్లే తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న అంబరీష్ ఇంతకుముందు మంత్రికా కూడా పనిచేశారు.