కరోనాను నిర్మూలించడానికి బీజేపీ ఎంపీ ప్రజ్ఙా సింగ్ ఏం చెప్పారంటే? ఆగస్టు 5 వరకు.. రోజూ అయిదుసార్లు
భోపాల్: ప్రాణాంతక కరోనా వైరస్ దరిచేరకుండా ఉండటానికి భాభీజీ అప్పడాలను రోజూ తినాలంటూ సాక్షాత్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రెండురోజుల కిందటే ప్రకటించారు. అప్పడాలను తయారు చేయడానికి వినియోగించిన మసాలాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని చెప్పుకొచ్చారు. దీనిపై చెలరేగిన దుమారం తగ్గకముందే భారతీయ జనతాపార్టీకే చెందిన సీనియర్ నేత, భోపాల్ లోక్సభ సభ్యురాలు ప్రజ్ఙాసింగ్ ఠాకూర్ మరో చిట్కా చెప్పారు.
కరోనా వైరస్ను తరిమికొట్టడానికి రోజూ అయిదుసార్లు హనుమాన్ చాలీసాను పఠించాలని సూచించారు. ఈ మేరకు ఆమె తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. కరోనా వైరస్ బారి నుంచి విముక్తిని పొందబోతున్నామని అన్నారు. మంచిరోజులు వచ్చాయనీ చెప్పారు. ఆగస్టు 5వ తేదీన ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరామచంద్రుడి ఆలయ నిర్మాణానికి నిర్వహించే భూమిపూజతో అన్ని కష్టాలు తీరబోతున్నాయని చెప్పారు.
आइए हम सब मिलकर कोरोना महामारी को समाप्त करने के लिए लोगों के अच्छे स्वास्थ्य की कामना के लिए एक आध्यात्मिक प्रयास करें आज25 से 5 अगस्त तक प्रतिदिन शाम 7:00 बजे अपने घरों में हनुमान चालीसा का 5 बार पाठकरें5 अगस्त को अनुष्ठान का रामलला की आरती के साथ घरों में दीप जलाकर समापन करें pic.twitter.com/Ba0J2KrkA8
— Sadhvi Pragya singh thakur (@SadhviPragya_MP) July 25, 2020
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమిపూజను నిర్వహించ తలపెట్టిన ఆగస్టు 5వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసాను పఠించాలని విజ్ఙప్తి చేశారు. ఈ 10 రోజుల పాటు సరిగ్గా సాయంత్రం 7 గంటలకు ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసాను అయిదుసార్లు పఠించాలని సూచించారు. రోజూ అయిదుసార్లు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మన సంకటాలన్నీ తీరుతాయని అన్నారు. కోట్లాదిమంది హిందువులు ఒకేసారి, ఒకే సమయానికి అయిదుసార్లు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల ఖచ్చితంగా ఆశించదగ్గ ఫలితాలు వస్తాయని ప్రజ్ఙాసింగ్ అన్నారు.
Recommended Video
చివరిరోజైన ఆగస్టు 5వ తేదీ నాడు ప్రతి హిందువు దీపాలను వెలిగించాలని, శ్రీరామచంద్రుడికి భక్తితో పూజలను నిర్వహించాలని చెప్పారు. భోపాల్లో వచ్చేనెల 4వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుందని, 5వ తేదీన హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమం పూర్తవుతుందని అన్నారు. అదే రోజు అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమి పూజను నిర్వహిస్తారని అన్నారు. ఇంతకంటే మంచి సందర్భం లేదని చెప్పారు. కరోనా వైరస్ బారిన పడిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ త్వరలోనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.