ఢిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత... సాధారణం కంటే 7 డిగ్రీలు ఎక్కువగా...
ఓవైపు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా... దేశ రాజధాని ఢిల్లీ మాత్రం ఎండలతో అల్లాడుతోంది. బుధవారం(జూన్ 30) అక్కడ రికార్డు స్థాయిలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇప్పటివరకూ నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం. ఢిల్లీలోని సఫ్దర్ గంజ్లో ఉన్న వాతావరణ శాఖ కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది.
ఢిల్లీ పొరుగునే ఉండే గుర్గావ్లోనూ అత్యధికంగా 44.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ,గుర్గావ్ ఈ రెండు నగరాల్లో సాధారణం కంటే 7 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవడం గమనార్హం. ఎండ తీవ్రత పెరగడంతో సహజంగానే ఏసీల వాడకం పెరిగి విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. బుధవారం పీక్ పవర్ డిమాండ్ 6921 మెగావాట్లుగా నమోదైంది.

ఈ ఏడాది ఢిల్లీకి వర్షాలు కాస్త ఆలస్యంగా మొదలవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీ,హర్యానా,పంజాబ్ రాష్ట్రాలకు మరో వారం రోజులు గడిస్తే తప్ప వర్ష సూచన లేదని తెలిపింది. అయితే శుక్ర,శని(జులై 2,3) వారాల్లో ఢిల్లీలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీంతో నగరంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఢిల్లీ,హర్యానా,పంజాబ్,రాజస్తాన్ మినహా ఇప్పటికే దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. రాబోయే ఆరు నుంచి ఏడు రోజులు బిహార్,పశ్చిమ బెంగాల్,సిక్కీం,ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్,నాగాలాండ్,మణిపూర్,మిజోరం,త్రిపుర రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్,హర్యానాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,బిహార్,ఛత్తీస్ఘర్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శఆఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications