చైనా ఆందోళన-మాల్యా ఎఫెక్ట్!: డోల్కున్ ఇసాపై మోడీ రివర్స్ గేర్
న్యూఢిల్లీ: ప్రపంచ వీగర్ కాంగ్రెస్ నేత, ఉగ్రవాదిగా చైనా ప్రకటించిన డోల్కున్ ఇసాకు మంజూరు చేసిన వీసాను మన దేశం రద్దు చేసింది. భారత్లో ఎందుకోసం పర్యటించనున్నారనే విషయంలో తప్పుడు సమాచారం అందచేయడం వల్లే ఆయన వీసాను రద్దు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ నెల 28వ తేదీన హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరగనున్న సదస్సు కోసం డోల్కున్ ఇసాకు భారత్ తొలుత వీసా మంజూరు చేసింది. ఇటీవల జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్ పైన నిషేధం విధించే తీర్మానానికి ఐక్యరాజ్య సమితిలో చైనా మోకాలొడ్డింది.
ఈ నేపథ్యంలో డోల్కున్ ఇసాకు వీసా మంజూరు చేసి కేంద్రం ధీటైన సమాధానం ఇచ్చిందని అందరూ భావించారు. భారత్ నిర్ణయాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది.
ఈ నేపథ్యంలో డోల్కున్ ఈసా వీసాను భారత్ రద్దు చేసింది. ఆయన ఈ వీసా ధరఖాస్తులో మాత్రం పర్యాటకుడిగా వస్తున్నట్లు తప్పుడు సమాచారం అందించారని, అందుకే వీసా రద్దు చేశామని ప్రభుత్వం తెలిపింది. పర్యాటక వీసాకు కాకుండా సదస్సు వీసా కోసం డోల్కున్ ఇసా దరఖాస్తు చేసుకోవాల్సిందని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, డోల్కున్ ఇసా పైన ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి. ఆయన భారత్లో అడుగు పెడితే అరెస్టు చేయాల్సి ఉంటుంది. మరోవైపు, విజయ్ మాల్యా, లలిత్ మోడీలను భారత్ రప్పించేందుకు మోడీ ప్రభుత్వం చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో డోల్కున్ వీసా వ్యవహారంలో తలదూర్చకుండా ఉంటే మంచిదని భావిస్తుండవచ్చునని అంటున్నారు.