ఎన్నికల్లో తిరస్కరిస్తే అబద్దాలను వల్లెవేస్తున్నారు, విపక్షాలపై ప్రధాని మోడీ, నడ్డాపై ప్రశంసలు
విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు కొన్ని తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి, అబద్ధాలనే ఆయుధాలుగా మలిచే ప్రయత్నం చేస్తున్నాయి' అని మోడీ మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. విపక్షాలపై తనదైనశైలిలో ప్రధానమంత్రి మోడీ విరుచుకుపడ్డారు.

ఇప్పుడు నడ్డా వంతు
బీజేపీ కోసం అమిత్ షా విశేషంగా కృషిచేశారని, ఇక ఇప్పుడు జేపీ నడ్డా కూడా అదేవిధంగా పనిచేస్తారని పేర్కొన్నారు. పార్టీ ఉన్నతి కోసం వీరంతా నిస్వార్థంగా పనిచేస్తున్నారని తెలిపారు. బీజేపీ చేపట్టిన సంస్థాగత పనులతో పార్టీ మరింత ఉన్నతస్థాయికి ఎదిగిందని ప్రధాని మోడీ అన్నారు. అధికారంలో ఉన్న సమయంలోనే ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించడం చాలా గొప్ప విషయమని మోడీ అన్నారు.

స్కూటర్పై తిరిగాం..
నడ్డా తన మిత్రుడు అని, ఇది వరకు పార్టీ కోసం తాము కలిసి పనిచేశామని గుర్తుచేశారు. ఒకే స్కూటర్పై తిరిగి పార్టీ ఉన్నతి కోసం శ్రమించామని చెప్పారు. జేపీ నడ్డా నాయకత్వంలో బీజేపీ మరింత బలోపేతం అవుతోందని విశ్వసిస్తున్నాని మోడీ పేర్కొన్నారు. బీజేపీ సిద్ధాంతాలు, ప్రాథమిక సూత్రాలతో నడ్డా నడుస్తారని.. అయితే ఇదివరకు తాము ప్రతిపక్షంలో ఉన్న కంటే కూడా ఎక్కువ సవాళ్లను ఎదుర్కొవలసి ఉంటుందని చెప్పారు. వాటిని నడ్డా ఎదుర్కొని పార్టీ బలోపేతం చేస్తారన్నారు.

మాటల్లో చెప్పలేను..
ఇప్పటివరకు బీజేపీ చీఫ్గా పనిచేసిన అమిత్ షా పై కూడా ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. అతని నాయకత్వంలో పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని చెప్పారు. పార్టీ కోసం అమిత్ షా చేసిన పనిని మాటల్లో చెప్పలేనని అన్నారు. పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు విశేషంగా కృషిచేశామని చెప్పారు.

కార్యకర్యలే ముఖ్యం..
తొలి నుంచి బీజేపీ కార్యకర్తల సంక్షేమం కోసం కృషిచేస్తుందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ప్రస్తావించారు. కార్యకర్తల అవిశ్రాంత శ్రమతో పార్టీ అభివృద్ధిలోకి వస్తుందని గుర్తుచేశారు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చేందుకు లక్షలాది మంది కార్యకర్తల శ్రమ ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications