వివాదం: పార్లమెంటులో రేఖ 'గెస్ట్ అపియరెన్స్'
న్యూఢిల్లీ: పార్లమెంటుకు గైర్హాజరు కావడంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యురాలు, బాలీవుడ్ అలనాటి అందాల తార రేఖ మంగళవారం గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. ఈ సమావేశాల్లో కొద్దిసేపు మంగళవారంనాడు దర్సనమిచ్చి వెళ్లిపోయారు. ఆమె ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.
రేఖ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభకు వచ్చి పన్నెండున్నర గంటలకు వెళ్లిపోయారు. బంగారు రంగు సిల్క్ చీర ధరించిన రేఖ రాజ్యసభలో సామాజిక కార్యకర్త అను ఆగా పక్కన కూర్చున్నారు. రాజ్యసభకు వారిద్దరు కూడా నామినేట్ అయిన సభ్యులే. పార్లమెంటుకు వచ్చిన రేఖ రెండు చేతులు జోడించి నవ్వుతూ నమస్కారం చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు.

రేఖ ఆగాతో మాట్లాడుతూ కనిపించారు. సభ మధ్యాహ్న భోజన విరామానికి వాయిదా పడడానికి కొద్ది సేపు ముందు ఇద్దరూ కలిసి వెళ్లిపోయారు. సభకు రాకపోవడంపై సచిన్ టెండూల్కర్తో పాటు రేఖపై గత వారం విమర్శల జడివాన కురిసింది. రేఖ, సచిన్ టెండూల్కర్ 2012 ఏప్రిల్లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
సచిన్ టెండూల్కర్ అప్పటి నుంచి మూడు సార్లు సభకు వచ్చారు. ఈ ఏడాది ఒక్క సమావేశానికి కూడా రాలేదు. చివరి 2013 డిసెంబర్ 13వ తేదీన ఆయన రాజ్యసభలో కనిపించారు. వివాదాల నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ సోమవారంనాడు సెలవుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు సెలవు మంజూరైంది.
కాగా, మంగళవారంనాటి హాజరును మినహాయిస్తే 2012 ఏఫ్రిల్ నుంచి రేఖ ఏడు రోజులు మాత్రమే సభకు వచ్చారు చివరి సారి ఆమె 2014 ఫిబ్రవరి 12వ తేదీన రాజ్యసభకు హాజరయ్యారు. మళ్లీ మంగళవారంనాడు వచ్చారు. వరుసగా ఏ సభ్యుడైనా 60 రోజుల పాటు సభకు గైర్హాజరైతే అతను సభ్యత్వాన్ని కోల్పోతాడు.












Click it and Unblock the Notifications